రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలతో వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. జగన్ పాలనలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ ప్రొసీజర్లు పెంచాలని కానీ, ఆస్పత్రులు కట్టాలని కానీ, మెడికల్ కాలేజీలు తీసుకు రావాలని కానీ ఆలోచన చేయలేదని ఎద్దేవా చేశారు. రూ.16 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులను ఆధునికీకరించి, నూతన భవనాలు నిర్మిస్తే అది లోకేశ్ కు కనిపించలేదా.? అని నిలదీశారు.


కాగా, నాగార్జున సాగర్ జలాశయం పక్కనే ఉన్న విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆస్పత్రిలో రోగులకు చెట్ల కింద వైద్యం అందించడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. వైద్య ఆరోగ్య మంత్రి సొంత జిల్లాలోనే ఈ దుస్థితి నెలకొందంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అసమర్థ పాలనలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందని, నాలుగున్నరేళ్ల పాలన ప్రజలకు శాపంలా మారిందని ధ్వజమెత్తారు. చెట్ల కింద రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న దుస్థితే జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన తండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాస్పత్రిలో మూడేళ్లుగా చెట్ల కిందే వైద్య సేవలు అందిస్తున్నారంటే సీఎం సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు.


రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే, అల్లూరి జిల్లా వంటి మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇక దేవుడే దిక్కని లోకేశ్ ఎద్దేవా చేశారు. 'కరోనా విజృంభణ సమయంలో ఆక్సిజన్ సరఫరా వైఫల్యం కారణంగా కళ్లెదుటే, వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశాం. జగన్ దివారా కోరు పాలనా పుణ్యమా అని కర్నూలు, అనంతపురం బోధనాస్పత్రుల్లో దూది సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఇంతటి దారుణ పరిస్థితులుంటే తమ హయాంలో వైద్య, ఆరోగ్య రంగం వెలిగిపోతుందని, జగనన్న సురక్ష పేరుతో ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నామని సీఎం గొప్పగా చెబుతున్నారు.' ఇలాంటి వ్యక్తిని సైకో అని కాక మరేమనాలి? అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న వెనుకబడిన గ్రామాల్లో ఏ ఒక్కరికి అనారోగ్య సమస్య వచ్చినా, నాగార్జున సాగర్ జలాశయం పక్కనే ఉన్న విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆస్పత్రే దిక్కు. కానీ, ఇక్కడ గత మూడేళ్లుగా చెట్టు కిందే వైద్య సేవలు అందిస్తున్నారని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం సాగర్ డ్యాం క్వార్టర్స్ లో ఆస్పత్రి నడుస్తోంది. వైద్య సిబ్బంది 10 పడకలు ఆరుబయటే వేసి రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఈ దృశ్యాలు వైరల్ కాగా, టీడీపీ విమర్శిస్తోంది. 


Also Read: 'దేశంలో అవినీతి పోవాలంటే ప్రత్యక్ష ఎన్నికలే మార్గం' - డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు