ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయాలు హాట్ హట్ గా సాగుతున్నారు. అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. పరస్పరం అవినీతి ఆరోపణలతో వేడి పుట్టిస్తున్నారు. కల్యాణదుర్గం పర్యటనలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై మంత్రి ఉషశ్రీ ఫైరయ్యారు. 2 ఎకరాల పొలం నుంచి 2వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.  తనది సంపన్న కుటుంబమన్న మంత్రి ఉషశ్రీ భూములు కొంటే తప్పేంటని ప్రశ్నించారు. 168ఎకరాల భూమి కొనుగోలు చేసింది వాస్తవమేనన్న మంత్రి భయంతోనే టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమది పుట్టుకతోనే జమీందార్‌ కుటుంబమని.. భూములు కొంటే తప్పేంటన్నారు. హెరిటేజ్‌ ఆస్తులు పంచితే మా ఆస్తులు పంచుతామని.. చంద్రబాబు మొదలుపెట్టిన రోజే పేదలకు ఇస్తానంటూ ఉషశ్రీ ఛాలెంజ్ చేశారు. 


బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రెండ్రోజుల క్రితం చంద్రబాబు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పర్యటించారు. బహిరంగసభలో మంత్రి ఉషశ్రీ చరణ్‌పై పలు ఆరోపణలు చేశారు.  కళ్యాణదుర్గంలో అన్నీ కబ్జాలు, సెటిల్‌మెంట్లేనని ధ్వజమెత్తారు. 168 ఎకరాలు తక్కువ ధరకే మంత్రి లాక్కున్నారని ఆరోపించారు. లే అవుట్ వేస్తే డబ్బులియ్యాల్సిందేనని తెలిపారు. మంత్రి కొట్టేసిన 168 ఎకరాలకు తాను డబ్బు ఇస్తానని, భూములు తిరిగిస్తారా అని ప్రశ్నించారు. సాగునీటి రంగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందిన్న బాబు.. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని కృష్ణా నదిలో నీటి కొరత ఉండడంతో ఆల్మట్టి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండని పరిస్థితులు ఉన్నాయన్నారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు దాదాపు 69వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనన్నారు.


చంద్రబాబు కామెంట్స్ కు మంత్రి ఉషశ్రీ కౌంటర్ ఇచ్చారు. రెండు ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించావో చెప్పాలని డిమాండ్ చేశారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు శిలాఫలకం వేసి మరచిపోయారన్న ఆమె భైరవానితిప్ప ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కళ్యాణదుర్గానికి ఏం చేశారని నిలదీశారు.