Minister Vanitha: అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో నూతనంగా నిర్మించిన రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఏదైనా కేసు నమోదు అయినపుడు త్వరిత గతిన విచారణ పూర్తి చేసేందుకు ఈ ల్యాబ్ లు ఎంతగానో ఉపయోగపడతాయని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి సంకల్పం మేరకు పోలీసు శాఖలో ప్రతీ ఒక్కరూ నిబద్దత అంకిత భావంతో పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు సత్వర న్యాయం చేసే దిశగా జీరో ఎఫ్ఐఆర్ తీసుకొచ్చామని ఆమె గుర్తు చేశారు. పరిధులు లేకుండా బాధితులకు న్యాయం చేస్తున్నామని మంత్రి వనిత స్పష్టం చేశారు. కరోనా, వరదలు, తదితర విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించడం అభినందనీయం అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకోచ్చామని... ప్రతీ పోలీసు స్టేషన్ లో రిసెప్సన్ సెంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామని వివరించారు. దిశ చట్టం అమలులోకి రాక పోయినప్పటికీ... ఈ చట్టంలో రూపొందించిన ప్రకారంగా దిశ పోలీసు స్టేషన్లు, తదితరాలు ఏర్పాటు చేసి మహిళలకు సత్వర న్యాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. 


సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు


ఇటీవల పెరిగిపోతున్న ఆన్లైన్ లోన్ యాప్స్  నిర్వాహకుల ఆట కట్టిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత , డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆర్ఎఫ్ఎస్ఎల్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన వీరిరువురూ ఆన్లైన్ లోన్స్ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆన్లైన్ లోన్ పట్ల ఆకర్షితులైన అమాయకులు లోన్ తీసుకొని అధిక వడ్డీలు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు లోన్స్ సకాలంలో చెల్లించకపోతే వారి బంధువులకు ఫోన్లు చేయడం వీరికి సంబంధించిన ఫోటోలు ప్రచారం చేయడం వంటివి చేస్తున్నట్లు కూడా తెలిసిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాలలో సీరియస్ గా ఉన్నారని పేద ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. ఆన్లైన్ లోన్ యాప్ లో కట్టడికి ప్రత్యేక సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితులలో సైబర్ నేరగాళ్ల ఆటలు సాగనివ్వమని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ చేస్తుందని తెలిపారు.  


కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించబోతున్న ల్యాబ్ లు..


కేసుల్లో సత్వర ఇన్వెస్టిగేషన్ జరగాలన్న ఉద్దేశ్యంతోనే అనంతపురంలోని పోలీస్ స్టేషన్లలో రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ కె.వి రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 13 వేలు శ్యాంపిల్స్ ను విశ్లేషించి ఆ నివేదికలు సంబంధిత పోలీసు స్టేషన్లకు పంపే విధంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లు ఉన్నాయన్నారు. కేసుల పరిష్కారంలో ఈ ల్యాబ్ లు కీలక పాత్ర పోషించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మరో అతి పెద్ద RFSL ననూతనంగా నిర్మితం కానుందని తెలిపారు. వీటి వల్ల మరింత మెరుగైన ఫలితాలు అందిస్తాం అన్నారు. 12 మంది సైంటిఫిక్ సిబ్బందితో ఇక్కడ సేవలు అందించనున్నట్లు తెలిపారు. అలాగే రాజమండ్రిలో కూడా త్వరలో ల్యాబ్ ను ప్రారంభించబోతున్నామని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి పేర్కొన్నారు. 


మరింత వేగంగా సేవలు..


అనంతపురంలో ల్యాబోరేటరీ ప్రారంభమవడం గర్వ కారణం అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. ఇప్పటి వరకు విశిష్టమైన సేవలు అందించిన పోలీసులు... మరింత మెరుగైన సేవలు అందించనున్నారని చెప్పారు. పోలీసులు అందరూ అంకి త భావంతో పని చేస్తున్నారని అన్నారు. వారి వల్లే మనం చాలా సంతోషంగా ఉంటున్నామని గుర్తు చేశారు. ఈ ల్యాబ్ ల వల్ల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పారు.