Minister Dharmana: విశాఖ పరిపాలనా రాజధానిగా వద్దొంటూ మీరు పాదయాత్ర చేస్తుంటే.. మేం నోరు మూసుకుని కూర్చోవాలా అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూటిగా ప్రశ్నించారు. మీరు మా పొట్ట కొడుతుంటే.. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా, ఇళ్ళల్లో పనిమనుషులుగానే మిగిలిపోవాలా.. అని మంత్రి నిలదీశారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని.. చంద్రబాబు అండ్ కో మాట్లాడటం చాలా పెద్ద తప్పు అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ విషయంలో ఏం జరిగిందో తెలియదా అని ధర్మాన ప్రశ్నించారు. రాష్ట్ర విభజనతో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైనదని ధర్మాన ప్రసాదరావు అన్నారు.


మీ ఆస్తులు పెరుగుతుంటే మేం చప్పట్లు కొట్టాలా - మంత్రి ధర్మాన


అమరావతి ప్రాంతంలో ఉన్నవారి భూములు, ఆస్తులు పెరుగుతుంటే దానికి రాష్ట్రమంతా చప్పట్లు కొట్టాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు విని అరసవెల్లి దేవుడ్ని దర్శనం చేసుకోండి తప్పులేదు కానీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల పీకకోసే పనిచేస్తామంటే తప్పు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతిని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వారికి చెందిన ఓ వర్గం మీడియా అనేక ఎత్తుగడులు వేస్తోందన్నారు. రైతాంగం పోరాటం చేస్తున్నట్టుగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి మిగతా ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజధాని మీద వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సుదీర్ఘమైన చర్చ అసెంబ్లీలో జరిగిందని... ఆ సభలో వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యుడిగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన మంత్రిగా అనేక అనుభవాలు, వాస్తవాలను వివరించడం జరిగిందని చెప్పారు. అమరావతిని రాజధానిగా చేయడం వెనుక అక్రమ సంపాదన కోసం చేస్తున్న పనిని, వారి అబద్ధాలు, అసత్యాలను శాసన సభలో సుదీర్ఘంగా వివరించడం జరిగిందని మంత్రి ధర్మాన తెలిపారు. జనసేన- టీడీపీ కలిసే ఎలక్షన్ కి వెళ్తాయన్నారు. 


'హైదరాబాద్ నేర్పిన పాఠం చూశాక కూడానా..?'


"ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ రాజధానిగా ఉండేది. హైదరాబాద్‌ను విడిచి రాష్ట్రాన్ని విడదీస్తామంటే ఏకకంఠంతో వీల్లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చెప్పారు. హైదరాబాద్‌ను వదులుకోమని ఎందుకు చెప్పామో ప్రజలంతా ఆలోచన చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత 65 సంవత్సరాల పెట్టుబడిని హైదరాబాద్‌లో పెట్టాం. అభివృద్ధి చేశాం. దేశ దృష్టిని ఆకర్షించే పట్టణంగా హైదరాబాద్‌ ఎదిగింది. అనేక ఉద్యోగాలు, రెవెన్యూ, ఇండస్ట్రీ అన్నీ హైదరాబాద్‌కు వచ్చాయి. తరువాత ఆ ప్రాంతంలో ఉన్నవారందరికీ ఆంధ్రప్రదేశ్‌ ను విభజిస్తే.. హైదరాబాద్‌ మనకే ఉంటుంది కదా.. ఫలాలు అన్నీ మనమే పొందొచ్చు కదా అనే స్వార్థం పెరిగింది. అది తప్పు అని నేను అనను. అందుకోసం ఉద్యమం పెద్ద ఎత్తున నడిపారు. ఏపీ మొత్తం వ్యతిరేకించింది" అని ధర్మాన తెలిపారు.


"ఉమ్మడి రాష్ట్రానికి లభించిన రెవెన్యూను అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేట్టుగా ఆనాడే పెట్టుబడి పెట్టి ఉంటే.. మిగతా అనేక రాష్ట్రాలు చేసినట్టుగా మనం కూడా చేసి ఉంటే ఇలాంటి ప్రమాదం రాష్ట్రానికి జరిగి ఉండేది కాదు. ఇండస్ట్రీస్‌ రాష్ట్రం నలుమూలలా పెట్టి, నలుచోట్ల నగరాలు అభివృద్ధి చేసి ఉంటే ప్రత్యేక తెలంగాణ కోరేవారు ఉండేవారు కాదు. ఒకవేళ కోరితే ఇవ్వడానికి ఆవేదన చెందాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. రాష్ట్రం విడిపోయిన తరువాత మనం పొరపాటు చేశామని అంతా గుర్తించాం. మళ్ళీ అటువంటి తప్పు జరగకూడదన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం" అని మంత్రి పేర్కొన్నారు. 


'అమరావతిలో లక్షల కోట్లు పెడితే మళ్ళీ పాత కథే..'


"అమరావతిలో 33 వేల ఎకరాలు తీసుకుని, అక్కడ నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో, మరో 60–70 సంవత్సరాలు దానిపై పెట్టుబడి పెడితే.. తెలంగాణలో జరిగిన పనే మళ్లీ జరగదని ఎవరైనా చెప్పగలరా..? మా ప్రాంతాన్ని విడిచివెళ్లండి అని భవిష్యత్తులో ఉత్తరాంధ్ర, రాయలసీమ వారు అంటే.. ఇప్పుడు నష్టపోయిన 65 సంవత్సరాలు కాకుండా.. మరో 60 సంవత్సరాలు నష్టపోయే అవకాశం ఉంది. అందుకోసమే ఈ మోడల్‌ను ప్రపంచంలో ఎక్కడా అంగీకరించడం లేదు. ఒకేచోట పెట్టుబడంతా పెట్టి.. అభివృద్ధి చేసే మోడల్‌ అంగీకారం కాదు" అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. 


'అమరావతిలో కూలీలుగా, మేస్త్రీలుగా, పని మనుషులుగా శ్రీకాకుళం ప్రాంత వాసులు చేస్తుండాలా..?'


రాజధాని ప్రాంతంలో ఉన్నవారి భూములు, ఆస్తులు పెరుగుతుంటే దానికి మేము చప్పట్లు కొట్టాలా..? చంద్రబాబు మాటలు విని అరసవెల్లి దేవుడ్ని దర్శనం చేసుకోండి తప్పులేదు కానీ, మా పీకకోసే పనిచేస్తామంటే తప్పు. ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెంది.. ఇంకో ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోతే.. అభివృద్ధి చెందిన ప్రాంతంలోని ప్రజలు దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇచ్చిన ఇన్సెన్ టీవ్స్, ఇనిస్టిట్యూషన్స్‌ ఫైనాన్స్‌ అన్నీ అందిపుచ్చుకొని అత్యంత వెనుకబడిన ప్రాంతాల ప్రజల ఆస్తులను, అవకాశాలను లాగేసుకుంటే, యజమానిగా ఉండే తన ప్రాంతంలోనే కూలీగా పనిచేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. అందుకోసం ఇలాంటి పనులను ఎంతమాత్రం అంగీకరించం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది సరైన నిర్ణయం. దేశంలో కూడా ఇలాగే జరగాలి. రాజ్యాంగం చెప్పినట్టుగా వనరులన్నీ అందరికీ అందాలి... అని ధర్మాన ప్రసాదరావుగారు వివరించారు.