Many TDP youth leaders got tickets in the second list :  తెలుగుదేశం పార్టీ రెండో  జాబితాలో వారసులు, రాజకీయ కుటుంబసభ్యులకు చోటు లభించింది.  రెండో జాబితాలో రాజకీయ కుటుంబం నుంచి ఏడుగురికి అవకాశం కల్పించారు చంద్రబాబు.  ప్రత్తిపాడు స్థానానికి దివంగత వరపుల రాజా భార్య సత్యప్రభ కు చోటుర దక్కింది.  టిక్కెట్ వరపుల రాజాకే దక్కాల్సింది.. కానీ ఆయన హఠాత్తుగా చనిపోవడంతో..  ఆయన భార్యకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. ఆమె చురుగ్గా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడంతో చంద్రబాబు ఆమె పేరునే  ఖరారు చేశారు.                      


నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని  కోవూరు కు కు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. నిజానికి అక్కడ మరో వారసుడికి అవకాశం ఇవ్వాలనుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి కుమారుడికి ఇంచార్జ్ ఇచ్చారు. ఆయనే పని చేసుకుంటున్నారు. వేమిరెడ్డి పార్టీలో చేరే వరకూ ఆయనకే టిక్కెట్ అని చెప్పుకున్నారు. వేమిరెడ్డి చేరడంతో ఆయన భార్యకు టిక్కెట్ కేటాయించాలని నిర్ణయించారు.  వెంకటగిరి స్థానానికి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మీప్రియకు అవకాశం కల్పించారు. కురుగొండ్ల రామకృష్ణనే పోటీ చేయాల్సి ఉంది కానీ మహిళలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన వారసురాలికి చాన్సిచ్చారు.                                      


శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాల కృష్ణరెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డికి పోటీ చేయనున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనూ బొజ్జల సుధీర్ పోటీ చేశారు. కానీ ఆయన ఓడిపోయారు. ఓడిపోయినప్పటి నుండి నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. ఇక కడప జిల్లా  కమలాపురం స్థానానికి పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా చైతన్య రెడ్డికి చోటు కల్పించారు. పుత్తా నరసింహారెడ్డి పలుమార్లు పోటీ చేసారు. ఈ సారి వారసుడ్ని రంగంలోకి తెచ్చారు.  పుట్టపర్తి స్థానం నుంచి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధుర రెడ్డి పోటీకి  అవకాశం ఇచ్చారు. ఇక అనంతపురం జిల్లా  కదిరికి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ భార్య యశోదా దేవికి పోటీకి అవకాశం కల్పించారు. కందికుంట ప్రసాద్‌కు కొన్ని  కేసుల్లో న్యాయపరమైన  చిక్కులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.                     


రెండో జాబితాలో చంద్రబాబు 34 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు.  మొదటి జాబితాలో జనసేనతో ఉమ్మడి జాబితా ప్రకటించిన టీడీపీ, ఇప్పుడు సపరేట్ గా రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 94మంది అభ్యర్థులను ప్రకటించిన బాబు రెండో జాబితాలో 34 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 14 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.