Landslide In Kondaveedu And Srisailam Ghatroads: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కాగా.. రహదారులపై నీరు చేరి రాకపోకలు బంద్ అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పల్నాడు జిల్లా (Palnadu District) యడ్లపాడు మండలం కొండవీడు ఘాట్ రోడ్డులో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడ్డాయి. మూలమలుపు వద్ద పలు చోట్ల పెద్ద బండరాళ్లు జారి కిందపడగా.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు కొండ దిగువన ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలను నిలిపేశారు. అటు, సమీపంలోని గొలుసుకట్టు చెరువులు నిండుకుండలా మారాయి. మరోవైపు, నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ (Amrabad) మండలం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ క్రమంలో అటు వైపు రాకపోకలు బంద్ చేశారు. మన్ననూర్ చెక్ పోస్టును అధికారులు మూసేశారు. కొండ చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున శ్రీశైలం వెళ్లే భక్తులు, పర్యాటకులు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.


నిలిచిన రాకపోకలు


మరోవైపు, భారీ వర్షాల కారణంగా ఆత్మకూరు - డోర్నాల, డోర్నాల - శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా మార్గాల్లో రహదారులపై చెట్లు విరిగి పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాకపోకలను నిలిపేశారు. ఆత్మకూరులోని పలు ప్రాంతాలు జలమయం కాగా.. ఇక్కడి సాయిబాబానగర్, ఇందిరానగర్, ఏకలవ్యనగర్, రహమత్ నగర్, లక్ష్మీనగర్‌లోకి వరద చేరింది. ఏకలవ్యనగర్‌లో 30కిపైగా ఇళ్లల్లోకి నీరు చేరింది. అటు, భవనాశి వాగు పొంగి ఆత్మకూరు - కొత్తపల్లి మధ్య రాకపోకలు నిలిచాయి. ఆత్మకూరు - దుద్యాల, ఆత్మకూరు - వడ్లరామాపురం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.


మున్నేరు వాగు ఉద్ధృతి


ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు వాగుకు వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చింది. స్థానిక తిరుపతమ్మ ఆలయ పరిసరాల్లోకి వరద చేరి అక్కడి దుకాణాలు నీట మునిగాయి. వ్యాపారులు సామాగ్రిని వదిలేసి బయటకు వచ్చారు. ఆలయ ప్రాంగణంలో కేశఖండనశాల, డార్మెటరీ నిర్మాణాల్లోకి వరద నీరు చేరింది. ఆలయం పక్కనే ఉన్న బోస్ పేట, ఎస్సీ కాలనీలో వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరద ఉద్ధృతి పెరిగిన క్రమంలో ఆలయ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల వారికి దేవస్థానం సత్రాల్లో పునరావాసం కల్పించారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న వంతెన నీట మునిగింది. గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతుండగా స్థానిక దుకాణదారుల్లో ఆందోళన నెలకొంది. అటు, పెనుగంచిప్రోలు నుంచి అనిగండ్లపాడు, రేవులగడ్డ వైపు వెళ్లే మార్గంలో భారీగా వరద చేరి అక్కడి వంతెన సైతం నీట మునిగింది.


అటు, తెలంగాణలోనూ కుండపోత వర్షాలతో మున్నేరు వాగు ఖమ్మం నగరంలో బీభత్సం సృష్టించింది. రాజీవ్ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడి అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం చిక్కుకోగా తమను రక్షించాలని వేడుకుంటున్నారు. అటు, వెంకటేశ్వరనగర్‌లోని ఓ ఇంటిని వరద చుట్టుముట్టింది. ఏడుగురు బాధితులు ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గణేశ్ నగర్, దానవాయిగూడెం ప్రాంతాల్లోనూ చాలా ఇళ్లు నీట మునిగాయి.


Also Read: AP Rains News: ఏపీలో 100 పునరావాస కేంద్రాల ఏర్పాటు, వేల మంది తరలింపు - వంగలపూడి అనిత