మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ కోసం ఎంపీ అవినాష్ రెడ్డికి నిన్న (ఏప్రిల్ 16) సీబీఐ నోటీసులు అందిన సంగతి తెలిసిందే. నేడు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు ఆ నోటీసుల్లో ఆదేశించారు. అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇది ఐదోసారి. సీబీఐ అధికారుల ఎదుట హాజరు కావడం కోసం పులివెందులలోని తన నివాసం నుంచి నేడు తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు బయలు దేరారు. 


ఉదయం 5.30 గంటలకు అవినాష్ రెడ్డి పులివెందులలోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఏకంగా 10 వాహనాల్లో తన అనుచరులతో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ కు ప్రయాణం అయ్యారు. వీరిలో వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే అవినాష్ ను జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 14 తేదీల్లో సీబీఐ విచారణ చేసిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి విచారణ సమయంలో గతంలో తరహాలోనే వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేయనున్నారు. నిన్ననే (ఏప్రిల్ 16) తండ్రి భాస్కర్ రెడ్డిని వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నేడు కుమారుడు అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తును ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది.


సహ నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి!
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల జాబితాలో తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా సీబీఐ చేర్చింది. ఇప్పటివరకూ జరిగిన సీబీఐ విచారణల్లో అనుమానితుడిగానే సీబీఐ పరిగణించింది. కానీ, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయన్ను సీబీఐ జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొన్నారు.


సీబీఐ విచారణపై అవినాష్ రెడ్డి ఆరోపణలు 


వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ అధికారులు ఏకపక్షంగా దర్యాప్తు చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వివేకా అల్లుడిని కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టుపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ అధికారుల విచారణ తీరు సరిగ్గా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థంపర్థం లేని విషయాలను సీబీఐ పెద్దదిగా చూస్తూ.. ఈ స్థాయికి దిగజారడం విచారకరమని వ్యాఖ్యానించారు.  అధికారుల తీరు గురించి సీబీఐ పెద్దలకు కూడా తెలియజేశామన్నారు. పాత అధికారులు చేసిన తప్పులను కొత్త అధికారులు కొనసాగిస్తున్నారని అన్నారు. తాము లేవనెత్తిన కీలక అంశాలపై వారు స్పందించడం లేదని.. వివేకా స్వయంగా రాసిన లేఖను కూడా పట్టించుకోవడం లేదని వివరించారు. ఆయన చనిపోయినప్పుడు తానే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చానని.. హత్య గురించి ముందుగా తెలిసింది వివేకా అల్లుడికే అని కీలక వ్యాఖ్యలు చేశారు. తన కంటే గంట ముందుగానే విషయం తెలిసినా ఆయన అల్లుడు పోలీసులకు ఈ విషయం చెప్పలేదని అన్నారు.