హిందూపురంలో తల్లీకుమారుడి ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త మలుపు తిరిగింది. స్థలం పట్టా వివాదంపై మున్సిపల్ కమిషనర్‌, తహసీల్దార్ స్పందించారు. శంకుంతలమ్మ పేరు మీద ఉన్న స్థలం పట్టా ఫేక్‌దని చెబుతున్నారు. నెంబర్ మార్చి స్థలాన్ని ఆక్రమించుకున్నారని అధికారుల వాదన. 


అధికార పార్టీ కౌన్సిలర్ గిరీష్ కుమార్ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టామన్నారు కమిషనర్‌. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్టు ఫిర్యాదు అందిందని ఆ కాపీని మీడియాకు చూపించారు కమిషనర్. ప్రభుత్వ స్థలాన్ని కాపడటమే తమ బాధ్యతన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ఈ వివాదం కోర్టులో కూడా ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని తమ మీదే ఆరోపణలు చేస్తే ఉద్యోగాలు చేయలేమంటున్నారు. 






అధికార పార్టీ నేతలు, అధికారులు కలిసి వేధిస్తున్నారని శంకుతల, ఆమె కుమారుడు నిన్న ఆత్మహత్యాయత్నం చేశారు. వాళ్లిద్దరు ఇప్పుడు బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. దీనిపై హిందూపురంలో హైటెక్షన్ వాతావరణం నెలకొంది. తల్లీకొడుకు ఆత్మహత్యయత్నానికి మున్సిపల్‌ కమిషనర్‌, వైసీపీ లీడర్లే కారణమంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, బీజేపీ లీడర్లు ర్యాలీ 
తీశారు. హిందూపురం మున్సిపల్ కార్యాలయ ముట్టడికి బయల్దేరారు. 


బీజేపీ లీడర్ల ర్యాలీ సంగతి తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. పెనుకొండ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో హిందూపురం మున్సిపల్‌ కార్యాలయం, ప్రధాన కూడళ్ల వద్ద బలగాలను పెట్టారు. మున్సిపల్ కార్యాలయం ముట్టడికి యత్నించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం చోటు చేసుకుంది. 


హిందూపురంలోని బోయవీదికి చెందిన శకుంతల ఆమె కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశఆరు. ఇంటి స్థలం పట్టా విషయంలో మున్సిఫల్ కమిషనర్‌, అధికార పార్టీ లీడర్లు వేధిస్తున్నారని ఆరోపించారు. 1992లో తమకు ప్రభుత్వం  పట్టా ఇచ్చిందని ఇప్పుడు దాన్ని ఫేక్ అంటూ వేధిస్తున్నారని శకుంతల కోడలు వాపోయారు. వారం రోజుల నుంచి నోటీసులు, కేసుల పేరుతో భయపెడుతున్నారని ఆరోపించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకే అత్త, భర్త పురుగుల మందు తాగారంటున్నారు బాధితురాలు. దీనిపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారామె. తన అత్త, భర్తకు మెరుగైన వైద్యం అందించాలని కూడా వేడుకున్నారు.