Jagananna Thodu: వడ్డీలేని రుణ సాయంతో చిరు వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న తోడు పథకంలో భాగంగా నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు నిధులను విడుదల చేశారు. 5,10,412 మంది లబ్ధిదారులకు రూ. 560.73 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. చిరు వ్యాపారులకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10 వేలు అందివ్వడంతో పాటు దానిపై వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 85 శాతం మంది మహిళలో ఉన్నారని వెల్లడించారు. సంక్షేమ పథకాల విషయంలో దేశం మొత్తం సంఖ్య కంటే.. ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం ఒక అరుదైన ఘటన అని పేర్కొన్నారు. 


వరుసగా నాలుగో ఏడాదిలోనూ నిధుల విడుదల


అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగో ఏడాదిలోనూ జగనన్న తోడు నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. ' దేశంలో ఎక్కడా ఇన్ని లక్షలమందికి ఈ రకంగా మంచి చేయడం లేదు. ఇన్ని లక్షలమంది చిరువ్యాపారులకు ఎక్కడా ఇంత మేలు జరడం లేదు. దేశం మొత్తం ఇస్తున్న రుణాలు కంటే ఆంధ్ర రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంది. ఈ పథకాన్ని పగడ్బందీగా నడుపుతున్న బ్యాంకర్లు, సచివాలయాల వ్యవస్థ, మెప్మా తదితర శాఖలకు అభినందనలు. పేదవాడికి మంచి జరిగేలా చేసే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది. ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరు వ్యాపారులకు మంచి జరిగింది. హస్త కళాకారులకూ ఈ పథకం ద్వారా మేలు జరిగింది. ఈ విడతలో 5,10,412 మందిలో 4.54 లక్షల మంది సకాలంలో రుణాలు చెల్లించి, మళ్లీ రూ.10 వేలు, ఆపైన రుణాలుగా అందుకుంటున్నారు. సకాలానికి కట్టిన వారికి ఇచ్చే రుణాలు రూ.10 వేల నుంచి రూ.13వేల వరకూ పెంచాం. ఇంతవరకూ 15.87 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 2,955.79 కోట్ల రుణాలు ఇచ్చాం. వీరిలో తిరిగి చెల్లించి.. మళ్లీ మళ్లీ రుణాలు పొందిన వారు దాదాపుగా 13.29 లక్షల మంది ఉన్నారు. ఇప్పటివరకూ వీరి తరఫున ప్రభుత్వం చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్లు' అని ముఖ్యమంత్రి తెలిపారు.


ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలే


'చిరు వ్యాపారులు సమాజ సేవ చేస్తున్నారు. ఒకరి మీద ఆధారపడకుండా.. వారు జీవనోపాధిని వారు చూసుకుంటున్నారు. అవకాశం వస్తే మరో ఒకరిద్దరికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అందుకనే వారికి తోడుగా నిలబడాలన్న ఆలోచన వచ్చింది. చేతివృత్తుల వారికీ పథకం వర్తిస్తోంది. రూ. 10వేల రుణంతో ఈ కార్యక్రమం మొదలైతే, క్రమం తప్పకుండా చెల్లించేవారికి మరుసటి ఏడాది వేయి పెంచమని, ఆ తర్వాత ఏడాది మరో వేయి పెంచమని, రూ.13వేల వరకూ ఇవ్వమని చెప్పాం. పాదయాత్రలో స్వయంగా నేను కళ్లారా చూశారు. చిరు వ్యాపారుల కష్టాలు చూశాను. వేయి రూపాయలు రోజుకు రుణం ఇస్తే.. వంద కట్‌ చేసుకుని, సాయంత్రానికి మళ్లీ వేయి రూపాయలు తీసుకునే పరిస్థితులు ఉండేవి. అలాంటి వారికి వ్యాపారాలు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. పెట్టుబడి వారికి పుట్టేది కాదు. రూ. 10ల వడ్డీకి కూడా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ పరిస్థితులన్నీ మార్చాలన్న ఉద్దేశంతో జగనన్న తోడు పథకం పుట్టింది. జగనన్న తోడు ద్వారా లబ్ధిపొందిన వారిలో 80శాతం అక్క చెల్లెమ్మలే. లబ్ధిదారుల్లో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారే ఉన్నారు. సామాజికంగా అట్టడుగున్న ఉన్న వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఎవరికైనా ఈ పథకం వర్తించని పరిస్థితి ఉంటే.. వెంటనే సచివాలయ వ్యవస్థను సంప్రదించండి. అక్కడున్న సిబ్బంది మీకు తోడుగా నిలుస్తారు. వాలంటీర్లను కోరినా.. వారు దరఖాస్తు చేయడంలో మీకు తోడుగా నిలుస్తారు. ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే ప్రభుత్వం తపన పడుతోంది' అని వ్యాఖ్యానించారు.