YS Jagan Kurnool Tour: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో పర్యటించారు. జైలులో ఉన్న తన పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి పాలనపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీరియస్ కామెంట్స్ చేశారు. జైలులో తనను కూడా అవమానించేలా ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు. మరో మూడేళ్లలో ప్రభుత్వం కూలిపోతుందని తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు కచ్చితంగా ఇంతకింతా అప్పగించాల్సి ఉంటుందని  వార్నింగ్ ఇచ్చారు. 

Continues below advertisement

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు ఈ మధ్య అరెస్టు చేసి కర్నూలు జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఆయన్ని వైఎస్ జగన్ పర్యటించారు. ఆయనతో గంటకుపైగా ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే అరెస్టు చేసే క్రమంలో పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే వందల మంది పోలీసులను ఆయన ఇంటిపైకి పంపించారని కిటికీలు, తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేశారని ఆరోపించారు.

రెడ్‌బుక్ పాలనలో పోలీసులు బరి తెగిస్తున్నారని, ఎమ్మెల్యే ఇంటి తలపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారని జగన్ పేర్కొన్నారు. ఒక శాసనసభ్యుడి పట్ల ఇలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. కేవలం గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

మొదటి కేసులో 34 మందిని, రెండో కేసులో 14 మందిని, మూడో కేససులో మరో 12 మందిని ఇరికించారని, మొత్తం 38 మంది వైసీపీ కార్యకర్తలను జైలుకు పంపించారని జగన్ వివరించారు. టీడీపీ కార్యకర్తలే దాడులు చేసి, తప్పును కప్పిపుచ్చుకోవడానికి తమపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని, ఒక సందర్భంలో టీడీపీ కార్యకర్తే తన భార్య బట్టలు చించేసి ఆ నేరాన్ని వైసీపీ నాయకులై నెట్టే ప్రయత్నం చేశారని జగన్ వీడియోలు చూపించారు. 

వైఎస్ జగన్ తన ప్రసంగంలో రెడ్ బుక్ అనే పదే పదే ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజ్యంగబద్ధంగా కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగంతో నడుస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా బీసీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీదిరి అప్పలరాజు, ముస్తాఫా, కారుమారి సునీల్ వంటి నేతపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది చంద్రబాబు శాడిస్ట్‌ మెంటాలిటీకి నిదర్శనమని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

జైల్లో అవమానించారని కామెంట్స్ 

జైలు లోపల ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్‌ సమయంలో తనను అవమానించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కావాలనే జైలు గ్రిల్స్ వెనుక నిలబెట్టి, జైలు సిబ్బందితో ఫొటోలు తీయించారని ఆయన తెలిపారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నిస్తే, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నామని సమాధానం ఇచ్చినట్టు జగన్ చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదని ఈరోజు బాబు నాటిన తప్పుడు విత్తనాలే రేపు విషవక్షాలపై ఆయన్ని చుట్టుముడతాయని జగన్ హెచ్చరించారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులు పెరిగాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. గిరి అనే కార్యకర్తను ఎమ్మెల్యే తన కారులో ఎక్కించుకొని వెళ్తుండగా వారిపై దాడి జరిగిందని, ఆ దాడిలో ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాముల చెయ్యి  విరిగిందని జగన్ వివరించారు. బాధితుల పక్షాన నిలబడితే కేసులు పెడతున్నారని, పోలీసు యంత్రాంగం కూడా ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఫిర్యాదులు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.  

ప్రజాప్రతినిధులను అక్రమంగా నిర్బంధించడం ద్వారా గొంతు నొక్కలేరని జగన్ స్పష్టం చేశారు. విరూపాక్షికి ధైర్యం చెప్పామని పార్టీ మొత్తం ఆయనకు అండగా ఉంటుందని, న్యాయస్థానాల్లో, ప్రజా క్షేత్రంలో కూటమి ప్రభుత్వానికి బుద్ది చెబుతామని స్పష్టం చేశారు.