కర్నూలు: తెలుగుదేశం పార్టీ ఎంతో తనకు ఎంతో గౌరవమని, తనకు చాలా మంది సన్నిహితులు ఆ పార్టీలో ఉన్నారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అన్నారు. అయితే టీడీపీ బాధ్యతల నుంచి చంద్రబాబు తప్పుకుని, యువనేత నారా లోకేష్కు బాధ్యతలు అప్పగించానలి ఏపీ సీఎంకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. తన కుమారుడు లోకేష్ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని, దయచేసి తాను చేసే సూచనను పాటించాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కర్నూలులో వక్ఫ్ బోర్డు, వక్ఫ్ భూముల గురించి జరిగిన కార్యక్రమంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొని ప్రసంగించారు. కుమారుడు, యువనేత నారా లోకేష్కు తెలుగుదేశం పార్టీని అప్పగించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. లోకేష్ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు, ఎలాగూ మీరు జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తడంతోనే అక్కడున్న వారు గట్టిగా అరవడంతో అసదుద్దీన్ షాకయ్యారు. జూనియర్ ఎన్టీఆర్కు అంత పాపులారిటీ ఉందా, నాకు తెలియదని వ్యాఖ్యానించారు. టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేపట్టే ఛాన్స్ ఉందా అన్నారు.
9 ఏళ్లు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. విభజిత ఏపీకి సైతం 5 ఏళ్లు సీఎంగా సేవలు అందించారు. నీ కెరీర్లో చాలా చూశావు. ఇక నారా లోకేష్కు అవకాశం ఇవ్వాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, కుమారస్వామి లాంటి వాళ్లకు పిల్లలపై ప్రేమ, వారి భవిష్యత్ కోరుకుంటే యువతకు అవకాశం ఇవ్వాలి. మా భూములు మా ఇష్టం, మాకు నచ్చింది చేసుకుంటాం. దానిపై మీకు హక్కు ఏముంది. మీ పిల్లలనే మీరు నమ్మనప్పుడు వక్ఫ్ బోర్డు లాంటివి ఏం నమ్ముతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హిందూత్వ అజెండాతో వస్తే, చంద్రబాబు వస్తారా, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరి వచ్చి మాకు మద్దతుగా నిలుస్తారా అని ప్రశ్నించారు.
సెక్యూలరిజం పేరుతో చీప్ పాలిటిక్స్ చేయకూడదని సూచించారు. జగన్ మోహన్ రెడ్డి కనీసం మమ్మల్ని నమ్ముతామని అంటారు. వక్ఫ్ బోర్డులో మార్పులను వైసీపీ ఎంపీలు వ్యతిరేకించినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. వాళ్లు కనీసం మాకోసం మాట్లాడతారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులు ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్తులు ఉండకూడదు అని చంద్రబాబు, టీటీడీ చెబుతున్నాయి. అలాంటిది వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలు ఇద్దరు ఎలా ఉంటారు. అయితే టీటీడీ బోర్డులో అన్య మతస్తులను ఎందుకు తొలగిస్తున్నారు. సెక్యూలరిజం ఎక్కడుందని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. హిందూ ఆలయాలు, బోర్డుల్లో అన్య మతస్తులు ఉండరాదని చెప్పే మీరు, వక్ఫ్ బోర్డుల్లో, మా దర్గా టీమ్స్ లో ముస్లిమేతరులు ఎందుకు ఉండాలి. హిందువులకో న్యాయం, ముస్లింలకు ఓ న్యాయమా అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.