కళ్యాణదుర్గం టీడీపీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. టీడీపీకి బలమైన నియోజకవర్గమైన కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు వర్గాల మధ్య ఆదిపత్య పోరుతో పార్టీ తీవ్రంగా నష్టపోతుందంటూ మండిపడ్డారు చంద్రబాబు. 


కళ్యాణదుర్గం నేతలతో జూమ్ ఆన్ లైన్ మీటింగ్‌లో ఇంటరాక్ట్ అయిన చంద్రబాబు నేతలందరికీ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. గతంలోనే ఉన్నం హనుమంతరాయ చౌదరికి నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని చెప్పానని, ప్రస్తుత ఇంచార్జ్ ఉమా మహేశ్వరనాయుడు కూడా అందరిని కలపుకుపోకుండా ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఇకనుంచి పార్టీ కార్యక్రమాలు అదిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకోవాలని గట్టిగా చెప్పారు. ఇప్పటికే పార్టీ చాల నష్టపోయిందని, ఇక చూస్తూ ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


దీనిపై సోషల్ మీడియాలో ఆడియో హల్ చల్ అవుతోంది. ఈ స్థాయిలో మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ కావడాన్ని సామాన్య కార్యకర్తలు స్వాగతిస్తోంటే నేతలకు మాత్రం మింగుడు పడలేదు. ఇక పార్టీ  ఎవరిని ఎంపిక చేస్తే వారిని గెలిపించుకోవాల్సిందే అంటూ స్పష్టం చేశారు చంద్రబాబు. ఉన్నం కుమారుడు మారుతి వ్యవహారంపై కూడా చంద్రబాబు సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా నేతల తీరు మాత్రం మారడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం టీడీపీ వ్యవహారంలో నేతల తీరు  మారకపోతే ఏం చేయాలో పార్టీకి బాగా తెలుసంటూ ఘటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.  


పార్టీ అధినేత వ్యాఖ్యలతో అసమ్మతి కార్యకలాపాలు చేస్తున్న నేతల భవిష్యత్ ఏంటో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రస్తుత ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు కూడా అసమ్మతి నేతలను కలపుకొనేందుకు ప్రయత్నాలు మొదలపెట్టినట్లు తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లకు చంద్రబాబు ఈ విధంగా స్పందించడంతో పార్టీ కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ నేతలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం విషయంలో చంద్రబాబు కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజుల్లో సమస్య మరింత జఠిలం అవుతుంది తప్ప పరిష్కారం కాదని, కచ్చితంగా ఎవరికో ఒకరికి భాద్యతలు అప్పగించాలని కార్యకర్తలు కోరుతున్నారు.


అప్పుడు కూడా ఎవరైనా అసమ్మతి కార్యక్రమాలు చేస్తే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలంటున్నారు  కార్యకర్తలు. మరి చంద్రబాబు వార్నింగ్ కేవలం జూమ్ మీటింగ్ కే పరిమితమా... లేక త్వరలోనే ఏమైనా కీలక నిర్ణయాలు ప్రకటిస్తారా అనే దానిపై స్థానిక పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడాన్ని కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక పార్టీ కి సంబందించిన కీలక నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందా అంటూ కార్యకర్తలు, నేతలు ఎదురుచూస్తున్నారు.