కేరళ రాష్ట్రం కన్నా విస్తీర్ణంలో పెద్దదైన రాయలసీమలో 14 జిల్లాలు ఏర్పాటు చేయాలని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాను నాలుగు జిల్లాలు, అనంతపురం జిల్లాను నాలుగు జిల్లాలు, కడప జిల్లాను మూడు జిల్లాలు, చిత్తూరు జిల్లాను మూడు జిల్లాలుగా చేయాలని బైరెడ్డి కోరారు. సీఎం జగన్ జిల్లాల విభజనను అస్తవ్యస్తంగా చేశారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శలు చేశారు. రాయలసీమలోని డోన్, ఆదోని, మదనపల్లె, హిందూపురంతో పాటు మరికొన్ని ముఖ్యమైన పట్టణాలను జిల్లాలుగా చేస్తే  ప్రజలకు అన్ని విధాలా బాగుంటుందని బైరెడ్డి అన్నారు. నాడు ఎన్టీఆర్ మండలాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన చేశారని కానీ నేడు సీఎం జగన్ దూరంగా ఉన్న మండలాలను దగ్గర జిల్లాలో దగ్గరగా ఉన్న మండలాలను దూరంగా ఉండే జిల్లాలో కలిపి ప్రజలకు దూరపు పాలన అందిస్తున్నారని బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రజల వద్దకు పాలన అందిస్తే జగన్ ప్రజలకు దూరపు పాలన చేస్తున్నారన్నారు. నందికొట్కూరును కర్నూలు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. డోన్ కు ద్రోణాచలంగా పేరు మార్చి జిల్లా కేంద్రంగా చేయాలన్నారు. సీఎం జగన్ పాలన రివర్స్ గేర్ లో వెళ్తోందన్నారు. వైసీపీ వాళ్లే జగన్ నెత్తిన భస్మాసుర హస్తం పెడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


రెవెన్యూ డివిజన్ లలో స్పల్పంగా మార్పులు


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం స్వల్పంగా మార్పులు చేసింది. ప్రకాశం, పల్నాడు, సత్యసాయి జిల్లాలకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లను సవరిస్తూ తాజాగా రెవెన్యూ శాఖ సవరణ నోటిఫికేషన్లు ఇచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న కనిగిరి డివిజన్‌లో కలిపినట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కనిగిరి డివిజన్‌లో ఉన్న ముండ్లమూరు, తల్లూరు మండలాలను ఒంగోలు డివిజన్‌లో కలిపారు. నర్సరావుపేట కేంద్రంగా ఉన్న పల్నాడు జిల్లాలోని గురజాల డివిజన్‌లో 14 మండలాలను 10 మండలాలకు తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గురజాల డివిజన్‌లో కొత్తగా ప్రతిపాదించిన పెదకూరపాడు, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాలను నరసరావుపేట డివిజన్‌లో కలిపారు. అంతకు ముందు ఇవి గుంటూరు డివిజన్‌లో ఉండేవి. దీంతో నరసరావుపేట డివిజన్‌లో మండలాల సంఖ్య 18కి చేరుతుంది. సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి డివిజన్‌లో ప్రతిపాదించిన 12 మండలాలను 8 మండలాలకు తగ్గించినట్లు ప్రకటించారు.కదిరి, తలుపుల, నంబులపూలకుంట్ల, గాండ్లపెంట మండలాలను కదిరి డివిజన్‌లో కలిపారు. ఈ నాలుగు మండలాలు అంతకు ముందు కదిరి డివిజన్‌లో ఉండేవి. చిత్తూరు జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన పలమనేరు డివిజన్‌లోని రొంపిచర్ల మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లో కలుపుతున్నట్లు పేర్కొన్నారు. 


Also Read: సమ్మె చేస్తే ఏమొస్తుంది.. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఏపీ సీఎస్ పిలుపు !