సాదించాలన్న పట్టుదల... ఉత్సాహం ఉంటే ఏదైనా సాద్యమే అని నిరూపిస్తున్నారు అనంతపురానికి చెందిన రాగే సూర్య ప్రసాద్. ట్రైనింగ్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఆప్రికాలోని కిలిమంజారో పర్వత శ్రేణిలోనే ఉహురు పర్వతశ్రేణిని అధిరోహించి తన సత్తా ఏంటో చూపించాడు.


ఉహురు పర్వతశ్రేణి ఎక్కిన అనంతపురం బాలుడు రాగే సూర్యప్రసాద్‌ ఇండియాలో రెండో వాడిగా గుర్తింపు పొందాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘనత సాధించిన మొదటి చిన్నారిగా రికార్డ్ సృష్టించాడు రాగే సూర్య ప్రసాద్. 2021లో బెంగళూరులో జరిగిన తైక్వాండో ఒలింపిక్స్‌లో అండర్-20 విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవశం చేసుకున్న అప్పట్లోనే ఈ బాలుడు పేరు మారుమోగింది. అదే స్ఫూర్తితో  సూర్యప్రసాద్ తరువాత కూడా సాహస క్రీడల వైపు మొగ్గు చూపాడు. ఇందు కోసం అప్పటికే పర్వతాల అధిరోహణలో అనంతపురం జిల్లాలో గుర్తింపు పొందిన కలెక్టర్ గంధం చంద్రుడు కొడుకుతోపాటు, పలువురిన స్పూర్తిగా తీసుకొని ట్రైనింగ్ తీసుకున్నాడు రాగే సూర్యప్రసాద్‌. 


కొడుకు రాగే సూర్యప్రసాద్‌ ఇంట్రెస్ట్ గమనించి తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాక్ క్లైంబింగ్‌లో శిక్షణ ఇప్పించారు పేరెంట్స్. ట్రైనర్ శేఖర్ బాబు పర్యవేక్షణలో గత సెప్టెంబర్, అక్టోబర్‌లో ట్రైనింగ్ సాగింది. తరువాత కడప జిల్లాలోని గండికోట వద్ద కూడా మరో నెల పాటు ఎత్తైన కొండలు, ప్రాంతాలు ఎక్కడంలో శిక్షణ తీసుకున్నారు. ఉదయమే కిలోమీటర్ల మేర వాకింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు తండ్రి శివప్రసాద్.


ఈ నెల ఒకటో తేదీన సహాయకుడు పురుషోత్తంతో కలిసి టాంజానియాలోని ఉహురు పర్వతశ్రేణిని ఎక్కడం స్టార్ట్ చేశాడు సూర్యప్రసాద్. ఈ పర్వతశ్రేణి వాతావరణం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ పర్వతం సుమారు5895మీటర్లు(5.89కి.మి.) ఉంటుంది. పర్వతారోహణలో అధిక వేడి, చలి, వర్షం, మంచు లాంటి విభిన్న వాతావరణం ఉంటుంది. వీటన్నటిని అధిగమించి ఈనెల ఐదో తేదీ నాటికి  పర్వతశిఖరాగ్రానికి చేరుకొని అక్కడ భారతదేశం పతాకంతోపాటు, ఫాదర్ ఫెర్రర్‌ ఫొటో, ముఖ్యమంత్రి జగన్ ఫొటోను ప్రదర్శించాడు. ఎనిమిది సంవత్సరాల ఏడు రోజులు బాలుడు కీలకమైన, ప్రమాదకరమైన పర్వతశ్రేణిని అధిరోహించి రికార్డులకెక్కాడు రాగే సూర్య ప్రసాద్.


తన ఇంట్రెస్ గుర్తించిన తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు వచ్చిన పర్వతశ్రేణిని ఎక్కించే ట్రైనింగ్ ఇప్పించారని, వారి ప్రోత్సాహం, ట్రైనర్ల సహకారంతోనే ఇది సాధ్యమైందంటున్నాడు రాగే సూర్యప్రసాద్. ఇక నుంచి కూడా ప్రాక్టీస్ సీరియస్‌గా చేసి మరిన్ని పర్వతాలు ఎక్కేందుకు సిద్దం అవుతున్నట్లు తెలిపాడీ రాగే సూర్యప్రసాద్.