Krishna Tribunal Dismissed AP Govts Appeal: హైదరాబాద్: కృష్ణా జలాల వివాదాలపై కృష్ణా ట్రిబ్యునల్‌ విచారణ జరిపింది. కృష్ణా జలాల వివాదంపై తమ స్టేట్‌మెంట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరింత గడువు కోరింది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ఉన్నందున స్టేట్‌మెంట్‌ సమర్పించడానికి సమయం కావాలని ఏపీ సర్కార్ కోరింది. కానీ కృష్ణా ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఏప్రిల్ 29లోగా స్టేట్‌మెంట్ సమర్పించాలని ఏపీ సర్కార్ ను ట్రిబ్యునల్ ఆదేశించింది. స్టేట్‌మెంట్ ఇచ్చిన తరువాత రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించింది.


ఏపీ వాదనపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెండింగ్‌ కేసులకు ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే జల వివాదాలపై ఏపీ కాల యాపన చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి వాదనలు విన్న కృష్ణా ట్రైబ్యునల్..  స్టేట్‌మెంట్ సమర్పించడానికి జూన్‌ వరకూ సమయం ఇవ్వాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. తదపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది ట్రైబ్యునల్.