KA Paul :   ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి  ప్రచారం  చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ ఫోటోలతో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం విశాఖపట్నం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల రాజమహేంద్రవరం మంజీర హోటల్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీల తొలి సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లు తొలుత షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.  ఆ ఫోటోలో  ఇద్దరి మధ్య చర్చలు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు. వాటితో ఫ్లెక్సీ వేయించారు. ఆ ఫ్లెక్సీ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని..   అయితే తనను కించపరిచే విధంగా ఫోటోలు షేర్ చేశారని కేఏ పాల్ ఫీలయ్యారు. ఈ ఫోటోల మార్ఫింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. 


కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ పెట్టి .. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏమి జరిగినా స్పందిస్తూ ఉంటారు. ఆయనపై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్ వస్తూ ఉంటాయి. గతంలో తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు ఓ సారి దాడి కూడా జరిగింది.   రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వెళుతుండగా.. సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును ఖండించిన పాల్.. వారితో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్ ను చంపదెబ్బ కొట్టాడు. దాంతో కేఏ పాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.                   


ఆ తర్వాత తెలంగాణలో పర్యటించడం తగ్గించుకున్నారు. అయితే ప్రతీ సందర్భంలోనూ అతిశయం అనిపించే ప్రకటనలు చేస్త ఉంటారు. మునుగోడు ఉపఎన్నికల్లోనూ పోటీ చేశారు. రకరకాల వేషాలు వేశారు.కానీ డిపాజిట్ దక్కలేదు. పవన్ కల్యాణ్ తన పార్టీలోకి వస్తే సీఎం ను చేస్తానని చెబుతూ ఉంటారు. తాను ప్రధానమంత్రి అవుతానంటారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను సీఎంను చేయబోతున్నారని చెబుతారు. ఇలాంటి ప్రకటనలతో కేఏ పాల్ రాజకీయాల్లో ఓ భిన్నమైన వ్యక్తిగా చెలామణి అవుతున్నారు. సోషల్ మీమర్స్..  బ్రహ్మానందంతో పాటు కేఏ పాల్ హావభావాలు ఉండే ఫోటోలను ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇలా ..  లోకేష్, పవన్ ను.. ఆశీర్వదిస్తున్నట్లుగా కొంత మంది మీమ్ తయారు చేయడంతో పాల్ కు ఆగ్రహం వచ్చింది. అందుకే ఫిర్యాదు చేశారు.        


ఫిర్యాదు అందుకున్నామని పోలీసులు ఎక్నాలడ్జ్ ఇచ్చారు. కేసు నమోదు చేశారో లేదో స్పష్టత రావాల్సి ఉంది.