Chandrababu Naidu Arrest: ఏపీ రాజకీయాలు గత కొద్ది రోజులుగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ చుట్టూనే తిరుగుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో పాలిటిక్స్ హీటెక్కాయి. అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు గత ఐదు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ నిరసనలు చివరకు తెలంగాణకూ కూడా పాకాయి. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు ప్రధాన కూడళ్లలో ఆందోళనలు చేపడుతుండంతో తెలంగాణలోనూ చంద్రబాబు అరెస్ట్ అంశం హాట్ టాపిక్ గా మారింది.


చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పటికే తెలంగాణ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు స్పందించారు. టాలీవుడ్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకపోవడంపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. శుక్రవారం టాలీవుడ్ హీరోలపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు అరెస్ట్ గురించి టాలీవుడ్ హీరోలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. జగన్‌ను చూసి భయపడి చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా హీరోలను చూస్తుంటే సిగ్గేస్తుందని, అసలు మీరు హీరోలేనా అంటూ సీరియస్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు హీరోలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


హీరోలందరూ తెలంగాణలో సెటిల్ అయినా ఏపీలో ఆస్తులు ఉన్నాయని, రాష్ట్రం కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకు స్పందించరని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.  మీరు  రూ.కోట్ల డబ్బులు సంపాదించుకుంటూ సంతోషంగా ఉంటే సరిపోదన్నారు. సినిమా టికెట్ల ఇష్యూ సమయంలో జగన్ టేబుల్ వద్ద వణికిపోతూ హీరోలు కూర్చున్నారని, అప్పుడే మీ పరిస్థితి అర్థమైందంటూ వ్యాఖ్యానించారు. 'మీకు అంత స్డార్‌డమ్ ఉండి ఏం లాభం? రాజకీయాల గురించి మాట్లాడమని నేను అనడం లేదు. కనీసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి గళం విప్పండి' అని జేసీ సూచించారు.


'సినిమా టికెట్ల సమయంలో ఏమైందో అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వం వల్ల ఇండస్ట్రీ మరిన్ని  ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ప్రజల ఆస్తుల రికార్డులను ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటామని జగన్ చెబుతున్నారు. చివరకు హీరోల రోల్స్ రాయిస్ కార్లను కూడా జగన్ తాకట్టు పెడతారు. ఏపీలో కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. మాపై కేసులు పెట్టి హించిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమై పోతుందోననే భయం ఉంది.  ఇప్పటికైనా హీరోలు స్పందించకపోతే ఎవరూ ఏమీ చేయలేరు.  అశ్వినీదత్, నట్టి కుమార్, రజనీకాంత్ స్పందించారు. టాలీవుడ్ హీరోలుకు ఎందుకంత భయం.. మీ సినిమా టికెట్ల కోసం ప్రత్యేక విమానాలు వేసుకుని వచ్చారు. ప్రజలకు కష్టం వస్తే మాట్లాడరా?' అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.


కాగా చంద్రబాబు అరెస్ట్‌పై టాలీవుడ్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు.  డైరెక్టర్ రాఘవేంద్రరావు, అశ్వినీదత్, నట్టి కుమార్ మాత్రమే స్పందించారు. మామ అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించకపోవడం టీడీపీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.