Janasena : జనసేన అధ్యక్షుడు  పవన్ కల్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై జనసేన ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇస్తుంది. వరుస ట్వీట్లు చేస్తూ మహిళా కమిషన్, వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇటీవల కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు పెళ్లిళ్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. పవన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ నోటీసులపై జనసేన ఓ రేంజ్ లో కౌంటర్లు సంధిస్తుంది. వైసీపీ నేతలు పలు సందర్భాల్లో మాట్లాడిన బూతుల వీడియోలను ట్వీట్ చేసింది జనసేన. వీటితో పాటు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసింది. 






మహిళా కమిషన్‌ టార్గెట్ గా ట్విటర్‌లో జనసేన పార్టీ ట్వీట్ల వర్షం కురిపించింది. ఏపీలో అత్యాచారాలు జరుతుంటే, వైసీపీ నేతలు బూతులు తిడుతుంటే ఓ ఎంపీ వీడియో కాల్‌లో అడ్డంగా దొరికినప్పుడు  మహిళా కమిషన్ ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించింది.  18 అంశాలకు సంబంధించి వరుసగా ట్వీట్లు చేసింది జనసేన.  






జనసేన ప్రశ్నలు 



  •  ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? ఏం చేసింది ?

  •  దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో 32 ఏళ్ల మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా హత్యకు గురైంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? 

  •  మే 2022లో, బాపట్ల జిల్లాలోని రేపల్లె రైల్వే స్టేషన్‌లో 25 ఏళ్ల గర్భిణిపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

  • అత్యాచారం చేసేందుకు రాలేదు. దొంగతనం కోసం వచ్చి ఆపైన అత్యాచారం చేశారు అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మృగాళ్లకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

  • అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపం అని రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

  • మే 2022లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన 26 ఏళ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

  • 2021లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య 25% పైగా పెరిగిందని పోలీసులు డిసెంబర్ 28, 2021న వెల్లడించారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? 

  • 2021 ఆగస్టులో గుంటూరులో 20 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థినిపై పట్టపగలు దుండగుడు దాడి చేసి కడుపుపై ఆరుసార్లు కత్తితో పొడిచాడు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

  • 2021లో మహిళలపై నేరాలకు సంబంధించి 17736 కేసులు నమోదయ్యాయి. రిపోర్టు చేయని నమోదు కాని కేసులను కలుపుకొంటె సంఖ్య చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

  • వందలాది మంది ఆడబిడ్డల మానప్రాణాలు కోల్పోతుంటే, అండగా నిలబడాల్సిన అధికారంలోని నాయకులు, కార్యకర్తలే కీచకులుగా మారుతుంటే రక్షించకుండా దశా, దిశా లేని "దిశా " చట్టం పేరు చెప్పి చేతులు దులుపుకుంటుంటే ఏం చేస్తుంది మహిళా కమిషన్? న్యాయం ఎక్కడ?


ఇలా జనసేన వరుస ట్వీట్లు చేసింది. వీటితో పాటు జగన్ భజన మండలి సూక్తి ముక్తావళి అని ఓ వీడియో పోస్టు చేసింది.