CMO Fire On Appalraju :  ఏపీ ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి సిదిరి అప్ప‌ల‌రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎపి సిఎంవో తీవ్రంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.  ఎవరిపై అయినా కామెంట్స్ చేసేముందు జాగ్రత్తగా మాట్లాడాలని   హెచ్చరించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  నేతల స్థాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అనే దానిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలంటూ సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు.  


కేసీఆర్ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పలరాజు                                   


బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేస్తే జాతీయ పార్టీ అయిపోతుందా? అని ప్రశ్నించారు. ఆ పార్టీకి ఏ కోశానైనా జాతీయ వాదం ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అంతా ప్రాంతీయ వాదులు అని సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణకు నాయకులు అయ్యారని ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు సీదిరి అప్పలరాజు. 


అప్పల రాజు వ్యాఖ్యలపై విస్తృత ప్రచారం జరగడంతో దుమారం  


ఆంధ్రా ప్రజలు తెలంగాణకు రావడం మానేస్తే అడుక్కు తినడం తప్ప.. అక్కడ ఏమీ ఉండదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు అప్పలరాజు. తెలంగాణ రాజకీయాలు ఏపీలో ఏమాత్రం పని చేయవని అన్నారు మంత్రి. ఇవే కాకుండా రాయకూడని భాషలో చాలా కామెంట్స్ చేశారు మంత్రి అప్పలరాజు. ఈ వ్యాఖ్యలు ప్రింట్, ఎల‌క్ర్టానిక్ మీడియాలో రావ‌డంతో వెంట‌నే దాంతో ఏపీ సీఎంవో స్పందించింది. మంత్రి చేసిన కామెంట్స్‌పై సీరియస్ అయ్యింది. నోరు అదుపులో పెట్టుకోవ‌లంటూ స్వంత మంత్రిని హెచ్చ‌రించినట్లుగా తెలుస్తోంది. 


హరీష్ రావు వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం


హరీష్ రావు సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొని..,  తెలంగాణలో పనుల కోసం వచ్చిన కార్మికులు.. ఏపీలో ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో  నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చిన సందర్భంలో ఏపీలో పరిస్థితుల్ని గురించి చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా దుమారం రేగింది.  వైఎస్ఆర్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే  మంత్రి సీదిరి అప్పలరాజు రాజకీయ విమర్శలను దాటిపోయి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వివాదాస్పదమయింది. ఈ అంశం  వైఎస్ఆర్‌సీపీ పెద్దల దృష్టికి కూడా వెళ్లడంతో  సీరియస్ గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. 


వైఎస్ఆర్‌సీపీ, బీఆర్ఎస్  మధ్య రాజకీయంగా స్నేహం ఉంది. అయితే కొన్ని సార్లు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలతో ఇరు పార్టీల నేతలు విరుచుకుపడుతున్నారు. అగ్రనేతలు మాత్రం సంయమనంతనే ఉంటున్నారు.