GST New Rule: వ్యాపార సంస్థలకు సంబంధించి జీఎస్టీ కొత్త రూల్ మే ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. రూ.100 కోట్లు అంతకు మించి టర్నోవర్ ఉన్న సంస్థలు తమ ఎలక్ర్టానిక్ ఇన్ వాయిస్ లను జారీ చేసిన వారం రోజుల లోపే ఐఆర్పీ (ఇన్ వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్)లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని జీఎస్టీ నెట్ వర్క్ తెలిపింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ అన్ వాయిస్ లను జారీ చేసిన తేదీతో సంబంధం లేకుండా ఐఆర్పీలో అప్ లోడ్ చేస్తున్నాయి. ఇకపై అలా కుదరదు. వంద కోట్లు అంతకు మించి వార్షిక టర్నోవర్ ఉంటే పన్ను చెల్లింపుదారులు ఈ ఇన్ వాయిస్ ఐఆర్పీ పోర్టల్ లో తమ పాత ఇన్ వాయిస్ లను అప్ లోడ్ చేయడానికి కాల పరిమితిని విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జీఎస్టీ నెట్ వర్క్ పేర్కొంది. ఈ కొత్త రూల్ మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పరిమితి ఇన్ వాయిస్ లకు మాత్రమే వర్తిస్తుంది. 


డెబిట్ లేదా క్రెడిట్ నోట్ లను నివేదించడంలో ఎలాంటి కాల పరిమితి లేదు. జీఎస్టీ చట్టం ప్రకారం.. ఐఆర్పీలో ఇన్ వాయిస్ లు అప్ లోడ్ చేయకపోతే వ్యాపార సంస్థలు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందలేవు. ప్రస్తుతం 10 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు అన్నీ బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్ వాయిస్ ను రూపొందించడం తప్పనిసరి. జీఎస్టీ చట్టం ప్రకారం.. 2020 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు బిజినెస్ టు బిజినెస్ లావాదేవీల కోసం ఈ ఇన్ వాయిస్ ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత 2021 జనవరి 1వ తేదీ నుంచి 100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వారికి కూడా దీన్ని వర్తింపజేసింది. 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు బీ2బీ ఈ ఇన్ వాయిస్ లను సమర్పిస్తున్నాయి. అయితే 2022 ఏప్రిల్ 1 నుంచి ఆ పరిమితి 20 కోట్లకు, 2022 అక్టోబర్  1 నుంచి 10 కోట్లకు తగ్గించారు.