Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవికి ఊరట లభించింది. ఈ కేసులో రమాదేవిని అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు సీఐడీ స్పష్టం చేసింది. రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో రమాదేవి పేరును సీఐడీ నిందితురాలిగా చేర్చింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టులో రమాదేవి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగ్గా.. రమాదేవిని అరెస్ట్ చేయమని హైకోర్టుకు సీఐడీ స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో హైకోర్టులో ఆమెకు ఊరట లభించినట్లు అయింది.


సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద రమాదేవికి నోటీసులు జారీ చేసి విచారిస్తామని విచారణ సందర్భంగా హైకోర్టుకు సీఐడీ తెలిపింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరుపుతామని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సీఐడీ అరెస్ట్ చేయబోమని చెప్పడంతో రమాదేవి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. రమాదేవితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. వారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పిన సీఐడీ తరపు న్యాయవాది.. 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని హైకోర్టుకు తెలిపారు.


అటు ఈ కేసులో చంద్రబాబుకు ఇవాళ హైకోర్టులో ఊరట దక్కింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను ఈ నెల 17వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఇవాళ హైకోర్టులో మందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. అయితే వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరారు. దీంతో విచారణను బుధవారానికి వాయిదా వేశారు.  ఈ కేసులో చంద్రబాబు ఏ-1గా ఉండగా.. మాజీ మంత్రి నారాయణ, నారా లోకేష్, లింగమనేని రమేష్, కేపీవీ అంజనీ కుమార్, లింగమనేని సూర్య రాజశేఖర్‌లను కూడా నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. అలాగే హెరిటేజ్ ఫుడ్స్, ఆర్‌కె హౌసింగ్ లిమిటెడ్ వంటి సంస్థలను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చింది.


ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో గత ఏడాది మే 9వ తేదీన సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇటీవల పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా వాదించగా.. సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 9న హైకోర్టు కొట్టేసింది. దీంతో మరోసారి చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. అటు ఈ కేసులో నారా లోకేష్‌కు ఇటీవల సీఐడీ రెండు రోజుల పాటు విచారించింది. ఈ కేసులో లోకేష్‌ను అరెస్ట్ చేయమని ఇప్పటికే హైకోర్టుకు సీఐడీ తెలిపింది.