CM Jagan Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు(నవంబర్ 11) గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యింది. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ ను సీఎం జగన్ రేపు ప్రారంభిస్తారు. గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో  జగన్ పాల్గొంటారు. గుంటూరు మెడికల్‌ కళాశాలలో 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాటినం జూబ్లీ పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. 


సీఎం షెడ్యూల్ 


శుక్రవారం ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 9.25 గంటలకు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌కు సీఎం చేరుకుంటారు. 9.40- 10.35 వరకు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 10.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.10 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.30 గంటలకు గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్‌ ను సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 


ఆ రెండు జిల్లాల్లో 


గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రెండు జిల్లాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 11వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ  అరిఫ్  హఫీజ్ వివరాలను వెల్లడించారు.  అరండల్ పేట వైపు నుంచి మార్కెట్, బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలు, ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ నుంచి నాజ్ సెంటర్ మీదుగా, కృష్ణ మహల్ రోడ్డు నుంచి జిన్నా టవర్ మీదుగా బస్టాండ్ వెనుక వైపు మళ్లిస్తారు.


ట్రాఫిక్ మళ్లింపు 


బస్టాండ్ వైపుగా వెళ్లే వాహనాలను, ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ నుంచి నాజ్ సెంటర్, భగత్ సింగ్ బొమ్మ ,సెంటర్ 60 అడుగుల రోడ్ మీదుగా బస్టాండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ నుంచి హిందూ కాలేజ్, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వైపునకు ఎటువంటి రాకపోకలు అనుమతించరు. బస్టాండ్ వైపు నుంచి హిందూ కాలేజ్ వైపు వచ్చే  వాహనాలను మున్సిపల్ ఆఫీస్ మీదుగా పల్నాడు బస్టాండ్ నుంచి ఎత్తు రోడ్ వైపునకు మళ్లిస్తున్నారు. పట్టాభిపురం కంకర గుంట బ్రిడ్జ్  వైపు నుంచి మార్కెట్ బస్టాండ్ నవైపుకు వెళ్లే వాహనాలను, కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కలెక్టర్ బంగ్లా రోడ్డు నుంచి మెడికల్ క్లబ్ జంక్షన్  మీదుగా మస్తాన్ దర్గా ఎత్తు రోడ్డు వైపునకు మళ్లించనున్నారు. కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ నుంచి రమేష్ హాస్పిటల్, జిల్లా కోర్టు వైపునకు ఎటువంటి వాహనాలు అనుమతించరు. ఇక బస్టాండ్ మార్కెట్ వైపు నుంచి హిందూ కాలేజ్ వైపు కూడా ఎటువంటి వాహనాలను అనుమతించరు.