AP Vs CAG :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఎంత ఆదాయం వస్తోంది.. ఎంత ఖర్చు  పెడుతున్నారు .. ముఖ్యంగా ఎంత మేర అప్పులు చేస్తున్నారు లాంటివన్నీ దాచేస్తున్నారు. రాష్ట్రాల లెక్కలను చూడాల్సిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు కూడా సమాచారం పంపడం లేదు. కాగ్ పదే పదే లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదు. అయినా కేంద్రం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉండటం లేదు. దీంతో దేశంలోనే ఏపీ ప్రత్యేకమైన రాష్ట్రంగా ట్రీట్ చేస్తున్నట్లయింది. 


అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి  పదే పదే ఏపీ సర్కార్‌కు లేఖలు ! 


ఎకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయానికి లెక్కలు చెప్పడంలో ఏపీ ఆర్థికశాఖ పూర్తి స్థాయి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.  గత ఆర్థిక సంవత్సరంలో గ్యారెంటీలు, చేసిన అప్పుల వివరాలు లేకుండానే కాగ్‌ గణాంకాలు విడుదల చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అదే పంథాలో సాగుతోంది. కాగ్‌ విడుదల చేసిన తొలి రెండు నెలల లెక్కల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించిరది. తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారెంటీలు, అప్పుల వివరాలు రాలేదని స్పష్టం చేసిది. చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే రుణాలు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిలోకే వస్తాయని కేంద్రం తేల్చి చెబుతోంది. రిజర్వ్‌బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకున్న రుణాలతోపాటు, పలు సంస్థలకు గ్యారెంటీలుగా ఇచ్చిన రుణాలు కూడా ఈ పరిమితిలోకి వస్తాయని స్పష్టం చేసింది. 


ప్రభుత్వ ఇచ్చిన గ్యారంటీలు రూ. లక్ష కోట్లపైగానే !?


ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సంస్థలకు ఇచ్చిన గ్యారెంటీ రుణాలు అధికంగా ఉండడంతో వాటి వివరాలను కొంతవరకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఏపీ ప్రభుత్వం దాదాపుగా రూ . లక్ష కోట్ల రుణాలకు గ్యారంటీలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.  అందుకే ఈ వివరాలను కాగ్‌కు సమర్పించడంలో విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే తమ చేతికి గ్యారెంటీల వివరాలు అందడం లేదని కాగ్‌ పదేపదే రాష్ట్ర ఆర్థికశాఖకు లేఖలు రాస్తోరది. తాజాగా ఇదే అంశంపై ఆర్థికశాఖ అధికారులకు మరో లేఖ రాసినట్లు తెలిసింది. ఇదే సమయంలో మొతం రుణాల వివరాలు కూడా సమర్పించాలని కాగ్‌ కోరినట్లు సమాచారం. ఇప్పటికే గ్యారెంటీలు, రిజర్వ్‌బ్యాంకు వేలం ప్రక్రియ ద్వారా తీసుకున్న రుణాలు వాస్తవంగా ఏడాది మొత్తానికి కలిగిన పరిమితిని కూడా దాటేసినట్లు కనిపిస్తోంది. తరువాత కాలంలో తీసుకోబోయే రుణాలకు అదనపు అనుమతి కావాల్సిందేనని అధికారులే అంటున్నారు. అందుకే లెక్కలు సమర్పించడంలో ఆర్థికశాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 


కేంద్ర ఆర్థిక శాఖ నుంచి లేఖలు...కానీ చర్యలు శూన్యం !


కొద్ది రోజుల కిందట ఏపీ అప్పుల విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఘాటు లేఖ వచ్చింది. ఆ లేఖతో పది మందికిపైగా కార్యదర్శుల స్థాయి అధికారులు, ఆర్థిక మంత్రి బుగ్గన  రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు సీఎస్ , ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర అధికారులతో సమావేశం అయ్యారు. అక్కడేం జరిగిందో స్పష్టత లేదు కానీ.. రిజర్వ్ బ్యాంక్  నుంచి ఏపీ అప్పులుతీసుకుంటూనే ఉంది. అంటే కేంద్రం కాగ్‌కు లెక్కలు చెప్పకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థం. ప్రజాధనం  దుర్వినియోగం కాకుండా చూడటం..  లెక్కలన్నీ పక్కాగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ ఏపీ ఈ విషయంలో పెద్దగా పట్టింపులు లేనట్లుగా వ్యవహరించడం..కేంద్రం కూడా పట్టించుకోకపోవడం రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది.