ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు చెందిన జైలు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డిని ( Varuna Reddy ) ఒంగోలు జైలు సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఒంగోలు జైలర్‌ ప్రకాశ్‌ను కడప జైలు సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఏపీ డీజీపీని బదిలీ చేసిన కొద్ది నిమిషాల్లోనే జైలర్ల బదిలీ ఏపీలో చర్చాంశనీయంగా మారింది.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( TDP Chief Chandra babu )  కడప జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ వరుణారెడ్డిపై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల్ని జైల్లో చంపేందుకు ప్రణాళిక సిద్దం చేశారని అందుకే వరుణారెడ్డి నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ నియమించారని ఆరోపించారు. 


ఏపీ డీజీపీ సవాంగ్ బదిలీ - ఇంటలిజెన్స్ చీఫ్ కసిరెడ్డికి అదనపు బాధ్యతలు !


వరుణారెడ్డి వివాదాస్పద అధికారి. ఆయన అనంతపురం జైలర్‌గా ఉన్న సమయంలో పరిటాల రవి ( Paritala Ravi Murder ) హత్య కేసులో నిందితుడు మొద్దు శీను హత్యకు గురయ్యారు. ఆ అంశంపై వరుణారెడ్డిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించారని అంతర్గత దర్యాప్తులో తేలడంతో  ఆయనను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM Jagan Mohan Reddy ) ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుణారెడ్డికి అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీసులో భాగంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయన జైళ్ల శాఖలో  అత్యుత్తమ సేవలు అందించారని కేంద్ర ప్రభుత్వ పతకానికి కూడా సిఫార్సు చేశారు. ,


డీజీపీ సవాంగ్ బదిలీకి నారా లోకేష్‌ కారణమా?


ఈ క్రమంలో ఆయన కడప జిల్లా ఇంచార్జ్ సూపరిండెంట్‌గా నియమించడం కలకలం రేపింది. కడప జిల్లా జైలులో వివేకానందరెడ్డి హత్య కేసుకు ( Vivekanada Reddy ) సంబంధించిన కీలక నిందితులు ఉండటంతో  వరుణారెడ్డి నియామకం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమయింది. నిజానికి కడప జిల్లా జైలుకు సూపరింటెండెంట్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. కానీ వరుణారెడ్డిహోదా అడిషనల్ సూపరింటెండెంట్ మాత్రమే. ఈ కారణంగా ఆయనను ఇంచార్జ్‌గా నియమించినట్లుగా తెలుస్తోంది. వరుణారెడ్డి నియామకంగా రకరకాల ప్రచారాలు జరగడంతో చివరికి ప్రభుత్వం ఆయనను బదిలీ ( Transfer ) చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.  వివాదాల కారణంగానే ఆయన  బదిలీ జరిగినట్లుగా తెలుస్తోంది. డీజీపీ గౌతం సవాంగ్‌ను ప్రభుత్వం బదిలీ చేసి .. కొత్తగా ఇంటలిజెన్స్ చీఫ్ కసిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించిన కొద్ది సేపటికే జైలర్లను బదిలీ చేయడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమయింది.