విద్యావిధానంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సరికొత్త మార్పు తీసుకొస్తోంది. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తీసుకొస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. సెమిస్టర్ విధానం తెస్తూ ఉత్తర్వులు జారీ చేసిందిఏపీ ప్రభుత్వం. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు రెండు సెమిస్టర్లు ఉంటాయి. పదో తరగతికి 2024-25 విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్‌ సిస్టమ్‌ అమలు చేయనున్నారు. 


సీబీఎస్‌ఈ సిలబస్‌


 ఈ మధ్య ప్రభుత్వ బడుల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటికే పదో తరగతికి ఈ విధానం అమలు చేయనుంది. ఇప్పుడు మిగతా అన్ని తరగతులకు కూడా దీన్ని వర్తింపజేయనుంది. ముందుగా వెయ్యి ప్రభుత్వ బడుల్లో ఈ విధానం అమలు చేయనుంది. సీబీఎస్ఈ అనుమతి మేరకు 8వ తరగతి నుంచి సిలబస్‌ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే 8వ తరగతి విద్యార్థులంతా సీబీఎస్‌ఈ విధా­నంలో చదువుకోనున్నారు. 


ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశ పెట్టిన ప్రభుత్వం... ఇప్పుడు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశ పెట్టడమే కాకుండా సెమిస్టర్ సిస్టాన్ని కూడా తీసుకొస్తోంది. సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేస్తే విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలు అందుకోగలుగుతారని ప్రభుత్వం భావిస్తోంది. సీబీఎస్‌ఈ రూల్స్‌కు అనుగుణంగా ఉన్న 1308 బడులను గుర్తించిన ప్రభుత్వం అనుమతి కోసం బోర్డుకు పంపించింది. ఇందులో వెయ్యి సూల్స్‌ను షార్ట్‌ లిస్టు చేసింది సీబీఎస్‌ఈ బోర్డు. ఇప్పుడు ఆ వెయ్యి బడుల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమల్లోకి రానుంది. ఇందులో జిల్లా పరిషత్‌ స్కూళ్లు 417, మునిసిపల్‌ స్కూళ్లు 71, ఏపీ గురుకుల స్కూల్స్‌ 39, ఏపీ మోడల్‌ స్కూళ్లు 164, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 352, సోషల్ వెల్ఫేర్‌ స్కూల్స్‌ 179, బీసీ వెల్‌ఫేర్‌ రెసిడెన్సియల్‌ స్కూల్స్‌ 26, ఎస్టీ వెల్‌ఫేర్‌ రెసిడెన్సియల్‌ స్కూల్స్‌ 45, ఆశ్రమ్‌ స్కూళ్లు 15 ఉన్నాయి. 


వీటి అనుమతుల కోసం రూ.5.88 కోట్లను ఏపీ ప్రభుత్వం సీబీఎస్‌ఈ బోర్డుకు చెల్లించింది. ఈ స్కూళ్లలో 2023-24 నుంచే ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా బుక్స్‌ సరఫరా చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 64 చొప్పున, పార్వతీపురం మన్యం జిల్లాలో 40, విశాఖపట్నంలో 19, అనకాపల్లి జిల్లాలో 41, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 35, కాకినాడ జిల్లాలో 33, కోనసీమ జిల్లాలో 12, తూర్పుగోదావరి జిల్లాలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 16, ఏలూరు జిల్లాలో 34, కృష్ణా జిల్లాలో 9, ఎన్టీఆర్‌ జిల్లాలో 27, గుంటూరు జిల్లాలో 11, బాపట్ల జిల్లాలో 21, పల్నాడు జిల్లాలో 66, ప్రకాశం జిల్లాలో 63, నెల్లూరు జిల్లాలో 40, చిత్తూరు జిల్లాలో 22, తిరుపతి జిల్లాలో 30, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 30, అన్నమయ్య జిల్లాలో 49, కర్నూలు జిల్లాలో 90, నంద్యాల జిల్లాలో 69, అనంతపురం జిల్లాలో 51, శ్రీసత్యసాయి జిల్లాలో 49 స్కూల్‌లలో సీబీఎస్‌ఈ సిలబస్‌్ను ప్రారంభించనున్నారు.