TDP List :   తెలుగుదేశం పార్టీ పెండింగ్ ఉన్న సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు  భీమిలి నియోజకవర్గం కేటాయించారు. ఆయనను  చీపురుపల్లి నుంచి బొత్స మీద పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. కానీ ఆయన అందుకు అంగీకిరంచలేదు. భీమిలీలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.  ఆ మేరకు గంటాకు టీడీపీ అధినేత చాన్సిచ్చారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీకి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు  కళా వెంకట్రావును ఖరారు చేశారు. ఆయన నియోజకవర్గం ఎచ్చెర్ల బీజేపీ ఖాతాలోకి వెళ్లడంతో చీపురుపల్లి ఖరారు చేశారు.                                                                                             


మరో నాలుగు ఎంపీ స్థానాలకు కూడా చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు.  విజయనగరం- అప్పలనాయుడు , ఒంగోలు- మాగుంట శ్రీనివాసుల రెడ్డి , అనంతపూరం- అంబికా లక్ష్మీనారాయణ, కడపకు భూపేష్ రెడ్డి పేరును ఖరారు చేశారు. భూపేష్ రెడ్డి జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు.                                                           


 



పెండింగ్ ఉన్న ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించారు. అరకు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించంతో పాడేరుకు అభ్యర్థిగా కిల్లు వెంకట రమేష్ నాయుడును ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభ్యర్థి అయ్యారు. శిద్దా రాఘవరావు టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన రాలేదు. రాజంపేట నియోజకవర్గం నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేశారు. ఈ నియోజకవర్గం కోసం బీజేపీ పట్టుబట్టినా చంద్రబాబు అంగీకరించలేదు. ఇక టీడీపీలో చేరిన వైసీపీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు అందరూ ఊహించినట్లుగానే  గుంతకల్లు నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నుంచి టీడీపీ తరపున వీరభద్రగౌడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అనంతపురం అర్బన్ కూడా టీడీపీ ఖాతాలోనే పడింది. అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే  నేతకు అవకాశం కల్పించారు.                   


గతంలోనే కదిరి నియోజకవర్గానికి కందికంట వెంకట ప్రసాద్ సతీమణి యశోదా దేవిని అభ్యర్థిగా ప్రకటించారు. దీనికి కారణం  కందికుంట వెంకట ప్రసాద్ పై కొన్ని కేసుల్లో శిక్ష పడి ఉండటమే. సాంకేతిక సమస్యలు వస్తాయన్న కారణంగా ఆయన భార్యకు చాన్సిచ్చారు. అయితే ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆ శిక్షలన్నిటినీ కొట్టి వేసింది. దీంతో లైన్ క్లియర్ కావడంతో..  కందికుంట .వెంకట ప్రసాదే పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థి పేరును టీడీపీ హైకమాండ్ మార్చింది