జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రారంభిస్తున్న "జగనన్నకు చెబుదాం" కార్యక్రమానికి ఇప్పటికే జిల్లాల్లో జరుగుతున్న స్పందన కార్యక్రమానికి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా? అని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా స్పంద‌న‌కు కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజ‌నం ఏమైనా ఉందా రాష్ట్రంలో గడిచిన నాలుగు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు చిన్నాభిన్నమైపోయారని అన్నారు. మన రాష్ట్రంలో ఇప్పుడు సమస్యలు లేనివారు ఎవరు? తమ పొలాలు రాజధానికి ఇచ్చి ధగా పడ్డ అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు గంటా శ్రీనివాసరావు ఫేస్ బుక్ పోస్టు చేశారు.


‘‘జీతం ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూపులు చూస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? కరువులతో అల్లాడుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న పేద రైతుల  సమస్యలు పరిష్కరిస్తారా? పెన్షన్ ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే CPS రద్దు చేస్తారని మీకు ఓటు వేసి, మోసపోయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా?


* గడిచిన 4 సంవత్సరాల నుంచి జీతాలు సరిగ్గా పడక, జీతాలు పెంచక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల  సమస్యలు పరిష్కరిస్తారా?  


* అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నీషేదం అని చెప్పిన మీరు, ఇప్పుడు దాన్నే ఆదాయ వనరుగా మార్చి, మీరు తెచ్చిన కొత్త నాసిరకం బ్రాండ్లు తాగి ప్రాణాలు కోల్పోయి బజారున పడ్డ వారి కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరిస్తారా? 


* మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పోగొట్టుకున్న అవ్వ, తాతల సమస్యలు పరిష్కరిస్తారా? 


* మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక DSC నోటిఫికేషన్ కానీ.. ఒక APPSC నోటిఫికేషన్ లేక ఆశతో ఎదురు చూపులు చూస్తున్నా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా? 


* ఇసుకను వ్యాపారంగా మార్చేశారు. ఇసుక భారంతో సరైన ఉపాధి దొరక్క సుమారుగా 30 ల‌క్షల మంది భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తారా? 


* ఏ మాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా శ్రమనే పెట్టుబడిగా నమ్ముకున్న చేనేత కార్మికులు దుర్భర జీవితాలను వెలుగులు నింపుతారా? కష్టాల ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులు సమస్యలు పరిష్కరిస్తారా? 


* మీరు ఇస్తుంది గోరంత మా నుండి ఫైన్స్ రూపంలో, పెట్రోల్ డీజిల్ రూపంలో మీరు పీకుతుంది కొండంతా..  అని వాపోతున్నా ఆటో రిక్షా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారా?


 * ర‌క్తమోడ్చి మీ పార్టీని గెలిపించినా మీ MLA ల పైన అనుమాన‌పు, అవ‌మాన‌పు చూపులే అని క‌ళ్ల నీళ్లు పెట్టిన కొందరు MLA లు, తమకు జరిగిన అన్యాయం గురించి బాధని పంటి కింద బిగపట్టిన మరికొందరి మీ MLA ల సమస్యలు పరిష్కరిస్తారా..?


* 20 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి... స్పెషల్ స్టేటస్ సాధిస్తాం అని చెప్పిన మీరు, ఇప్పుడు మీరు ఢిల్లీలో చేస్తున్నదేంటి అని అడిగితే ఏమి సమాధానం చెబుతారు? 


* గెలిచిన తొలి సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేస్తామన్న మీరు, సంవత్సరాలు గ‌డుస్తున్నా, మీ మంత్రులు మారుతున్నా.. పోలవరం నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదంటే ఏమి సమాధానం చెబుతారు? 


* పార్లమెంట్ లో వైజాగ్ రైల్వే జోన్ కోసం పోరాడతాం, రైల్వే జోన్ సాధిస్తామన్న మీరు, ఇప్పుడు మౌనం ఎందుకు దాల్చారు? జోన్ కోసం మీ పోరాటం ఎక్కడ‌ అని అడిగితే ఏమి సమాధానం చెబుతారు? 


* మీ ప్రభుత్వ పాలనపై వేలెత్తి చూపిన వారిపై దాడులు, అక్రమ అరెస్టులు, ఆస్తులు ధ్వంసం ద్వారా ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు పరిష్కరిస్తారా?


* ఇలా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రంలో గడిచిన నాలుగు సంవత్సారాలలో ప్రతి ఒక్కరి జీవితం సమస్యల వలయంగానే మారింది! మీరు ఇలాంటి టోల్ ఫ్రీ నంబర్లు వందల కొద్ది పెట్టినా, ప్రజా సమస్యల ఫోన్ కాల్స్ తో మీ టెలిఫోన్ జంక్షన్ బాక్సలు జామ్ కావాల్సిందే కానీ ప్రజా సమస్యల పరిష్కారం కావు అనే స‌త్యాన్ని గ్రహించండి జ‌గ‌న్ గారూ!’’ అని గంటా శ్రీనివాసరావు ఫేస్ బుక్ పోస్టు చేశారు.