YSRCP News :   సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని వైసీపీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి ఎన్నికల్లో సిద్దారెడ్డికి జగన్ కేటాయించలేదు. మైనార్టీకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మక్బూల్ అహ్మద్ అనే  నేతకు టిక్కెట్ కేటాయించారు. దీంతో సిద్దారెడ్డి తీవ్ర అసంతృప్తికి గుర్యయారు. ఎన్నికల సమయంలో ఆయనను బుజ్జగించారు. అప్పటికి వైసీపీ విజయం కోసం పని చేస్తానని చెప్పిన ఆయన తర్వాత.. వైసీపీకి వ్యతిరేకంగా పని చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ చేయించిన జగన్ అది నిజమేనని గుర్తించి.. ఆయనపై వేటు వేస్తూ నిర్ణయంమ తీసుకున్నారు. వైసీపీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ చేతిలో ఓటమిపాలయ్యారు.                     


వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అయిన  సిద్దారెడ్డిని అనూహ్యంగా  సస్పెండ్ చేయడంపై వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేసిన వారిలో ఒక్క సిద్దారెడ్డి మాత్రమే కాదని..దాదాపుగా ప్రతీ నియోజకవర్గంలో అలాంటి నేతలు ఉన్నారని అంటున్నారు. అయితే పెద్దగా సమీక్ష ఏమీ చేయకుండానే.. కదిరిలో మాత్రమే సిద్దారెడ్డిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీలోనే ఆశ్చర్యకరంగా మారింది. తాను ఐదేళ్లు కష్టపడినా.. తనకు సంబంధం లేని అంశాలను ముడిపెట్టి తనకు టిక్కెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆయన ఇప్పటికీ అసంతృప్తిలో ఉన్నారని చెబుతున్నారు. పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తూండటంతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారని భావిస్తున్నారు.                             


మాజీ సీఎం జగన్ ఇటీవల పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఓటమికి దారి తీసిన పరిస్థితులపై చర్చిస్తున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి సమీక్షలు కాదు. ఓటమి తర్వాత కలుస్తామని  వచ్చే నేతల్ని మాత్రం కలుస్తున్నారు. ఇంకా సమీక్షలు ప్రారంభించలేదు. కానీ చర్యలు ప్రాంభించడంతో..తమకు వ్యతిరేకంగా పని చేసిన ఇతర నేతల పేర్లతో పలువురు సీనియర్ నేతలు.. జగన్ వద్దకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ఓటమికి కారణమయ్యారని.. వారికి పట్టు ఉన్నచోట కూడా ఇతర పార్టీలకు ఓట్లు వేయించారని ఆధారాలతో సహా పార్టీ హైకమాండ్ వద్దకు వెళ్తున్నారు. 


పార్టీని ప్రక్షాళన  చేయాలని జగన్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ కోసం పని చేసిన వారు మినహా.. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని ఇక ప్రోత్సహించకూదని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ముందు ముందు మరికొంతమందిపైనా వేటు వేసే అవకాశాలు  కనిపిస్తున్నాయి.