Perni Nani Who Became A Bus Driver: ఏలూరు జిల్లాలోని దెందులూరులో (Denduluru) నిర్వహించే 'సిద్ధం' సభకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ శ్రేణులకు 'సిద్ధం' సభా వేదికగా శనివారం సీఎం జగన్ (CM Jagan) దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సభకు భారీగా నేతలు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. మచిలీపట్నం నుంచి వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో సభకు బస్సుల్లో కదిలారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తన నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి బస్సులో దెందులూరు సభకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని స్వయంగా బస్సు డ్రైవర్ గా మారారు. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును ఆయన స్వయంగా నడిపారు. 'సిద్ధం' సభ టీషర్ట్, వైసీపీ క్యాప్ ధరించిన ఆయన డ్రైవింగ్ చేస్తూ.. రహదారి పొడవునా వాహనదారులకు అభివాదం చేశారు. ఆయన అభిమానులు జై పేర్ని అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 






దెందులూరుకు సీఎం జగన్


అటు, సీఎం జగన్ 'సిద్ధం' సభలో పాల్గొనేందుకు దెందులూరు చేరుకున్నారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఆయన సభా స్థలికి వచ్చారు. ఈ క్రమంలో నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వైసీపీ ఎన్నికల శంఖారావం సభలో పాల్గొని.. ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్ సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించారు. శనివారం విశాఖ జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఇప్పుడు దెందులూరులో రెండో సభ ద్వారా నేతలు, అభిమానులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపనున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కేడర్‌కు సూచించనున్నారు. సుమారు మూడు లక్షల మంది సభకు హాజరవుతారని పార్టీ నాయకులలు అంచనా వేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 20 వేల మందిని సభకు తీసుకువచ్చేలా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. కనీసం పది వేలు మందిని తరలించినా ఐదు లక్షల మంది అవుతారని ఆ పార్టీలు వర్గాలు చెబుతున్నాయి.


110 ఎకరాల్లో సభా ప్రాంగణం


తొలి సభ విజయవంతం కావడంతో రెండో సభను అంతకుమించి నిర్వహించేలా వైసీపీ ఏర్పాట్లు చేసింది. ఏలూరు నగర శివారు ఆటోనగర్‌ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు కనీసం మూడు లక్షల మంది హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభా ప్రాంగణాన్ని 110 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో సభకు వచ్చే వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడు గంటలకు రానున్నారు. సభ ఏర్పాట్లను అత్యంత వేగంగా పూర్తి చేశారు.


Also Read: TDP Meeting: ఈ నెల 5, 6 తేదీలలో 3 చోట్ల చంద్రబాబు రా కదలిరా సభలు, ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ