JD Lakshminarayana :   ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు.  జై భారత్ పార్టీ పేరుతో  ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గత ఏడాది పార్టీని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీ చేయాలని భావిస్తున్నారు. తొలుత ఆయన మళ్లీ జనసేన పార్టీలో చేరి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.                                        
  
2019 సార్వత్రిక ఎన్ని కల్లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీచేశారు. ఓడిపోయిన తర్వాత అక్కడే కొంత కాలం పని చేసుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణమంగా జనసేనకు రాజీనామా చేశారు. ఆ తర్వాత  రైతు, ప్రజా సమస్యలు, యువత ఓటింగ్ పై అవగాహన కల్పిస్తూ పర్యటించారు. తర్వాత ఆయన విశాఖలోనే మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఏ పార్టీ అన్నదానిపై స్పష్టత లేదు. ఏ పార్టీ కూడా ఆయనను ఆహ్వానించలేదు. అన్ని పార్టీల్లో విశాఖ లోక్ సభకు అభ్యర్థులు ఉండటంతో..ఆయనను చేర్చుకుని టిక్కెట్ ఇవ్వలేని పరిస్థితి  ఉండటంతో ఏ పార్టీ కూడా ఆయనను సంప్రదించలేదని తెలుస్తోంది. 


ఇటీవల ఆయన అన్ని పార్టీను పొగుడుతున్నారు. కేసీఆర్ సర్కార్ ను కూడా పలుమార్లు పొగిడారు. దీంతో ఆయన ఏపీ బీఆర్ఎస్ చీఫ్ అవుతారన్న ప్రచారం జరిగింది. చర్చలు జరిగాయి కానీ.. బీఆర్ఎస్‌లో చేరడం లేదని తర్వాత ప్రకటించారు. ఓ సారి శ్రీశైలం వెళ్లి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని పొగడటంతో ఆయన వైసీపీలో చేరుతారన్న చర్చ జరిగింది. కానీ ఆయన ఖండించారు.  చివరికి సొంత పార్టీ పెట్టాలని డిసైడయ్యారు. నిజానికి జేడీ లక్ష్మినారాయణ వీఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. అప్పట్లో సొంత పార్టీ  పెడితే ఎంతో కొంత వర్కవుట్ అయ్యేదన్న అభిప్రాయం వినిపించింది. కానీ అప్పట్లో జనసేనలో చేరి పోటీ చేశారు.  ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటించారు.                                         


ఆయన ఈ పార్టీతో రాష్ట్రమంతా అభ్యర్థుల్ని నిలుపుతారా.. లేకపోతే తానొక్కడే.. విశాఖ నుంచి పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. జేడీ విశాఖలో కాకుండా.. విజయవాడలో పార్టీని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. జేడీ లక్ష్మినారాయణ కొన్ని విలువల రాజకీయాలు చేస్తారని అందుకే.. .ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోరని అంటున్నారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్నది కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది.