Former CBI director Nageswara Rao expressed anger at a media organization : ఓ తెలుగు మీడియా సంస్థ తనపై తప్పుడు కథనాలు రాసిందని సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ అనే సంస్థలో తాను  భాగం అయ్యానని అనుకుని ఇలాంటి నిందలు వేస్తున్నారని విమర్శించారు. పదవీ విరమణ తర్వాత ప్రజావాహినిలో, జనస్రవంతిలో ఉండడం వలన మరియు కొన్ని ప్రజాహిత విషయాలపై స్పందించడం వలన చాలా మంది నన్ను వారి కార్యక్రమాలకు ఆహ్వానిస్తుంటారు. ఇవి తప్ప నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు.   





 


ఏప్రిల్ 16న  కొంతమంది పరిచయస్తుల ఆహ్వానం మేరకు నేను హైదరాబాద్‌లోని ASCI లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాను.   మాజీ భారత ప్రధాన ఎన్నికల కమిషన  V. S. సంపత్ గారు ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారని తెలిసి వెళ్ళానన్నారు.   పౌర సమాజం యొక్క పాత్ర మరియు ఆంధ్ర ప్రదేశ్ లో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించడానికి భారత ఎన్నికల కమిషన్‌ కు సహాయం చేయడానికి Election Watch  ఎంతో అవసరం అని వారు  పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైకాపాకి మరియు వారి ఆస్థాన సాక్షి మీడియాకి ఎందుకు కినుక కలిగించిందో విడ్డూరంగా ఉంది. తమ "ఎన్నికల నిర్వహణ" బట్టబయలు అవుతుందని భయపడుతున్నారా? ఏమోనని సెటైర్లు వేశారు.                                      


తప్పుడు కథనాలను, అభూత కల్పనలను, కాల్పనిక సాహిత్యాన్ని నేను పట్టించుకోను. అయితే ప్రజలను తప్పుదోవ పట్టించాలనే వారి కుట్రను భగ్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకొరకు నేను ఇక్కడ కొన్ని వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నాననని సోషల్ మీడియా ప్రకటనలో తెలిపారు. పూర్తి ఆస్తుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి నేను తెలియజేస్తూనే వచ్చాను. ఆ వివరాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో లభ్యమవుతాయి. అవి కాకుండా ఇంకా వేరే ఆస్తులు ఏమైనా నాకు ఉన్నట్లయితే వాటన్నింటినీ కథనాలు రాసిన పత్రికకు ఇచ్చేస్తాన్నారు.                                                                 


అవినీతి కూపంలో కూరుకుపోయిన వారికి, నిజాయితీ, చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులు అతిపెద్ద శత్రువులు. ఎందుకంటే నిజాయితీపరుల ఉనికి వారి అవినీతిని ఎత్తిచూపుతుంది. కాబట్టి, వారు తమ అవినీతిని కప్పిపుచ్చుకునే వ్యర్థ ప్రయత్నంలో నిజాయితీపరులపై ఎప్పుడూ బురద చల్లుతుంటారు. వ్యభిచారులు సంసారులపై బురద జల్లటం అనాదిగా వస్తున్నదే .. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు సామెత ఉందన్నారు. రెండు రోజులుగా ఏపీ అధికార పార్టీకి చెందిన పత్రికలో  సీబీఐ మాజీ డైరక్టర్ కు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి.