ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడున్న పోరస్ రసాయన పరిశ్రమలో అర్ధరాత్రి జరిగినందున కెమికల్ ఫ్యాక్టరీ ఎదుట ఈ ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదాలకు నిలయంగా మారుతున్న కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కెమికల్ ఫ్యాక్టరీ వల్ల చాలా కాలుష్యం బయటికి వస్తోందని, దాని కోరల్లో గ్రామంలో ప్రజలు చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారని  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుండి తొలగించాలని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఫ్యాక్టరీ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.


స్థానికుల ఆందోళనతో దిగొచ్చిన జిల్లా యంత్రాంగం ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విచారణ నిమిత్తం లోపల సిబ్బంది ఉన్నారే తప్ప ప్రస్తుతానికి ఫ్యాక్టరీలో ఎలాంటి కార్యకలాపాలు జరగడం  లేదన్నారు అధికారులు.


పరిశ్రమను తాత్కాలికంగా మూసేస్తున్నాం: కలెక్టర్‌ ప్రసన్న
ఈ అగ్ని ప్రమాద ఘటనపై కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ స్పందించారు. బాధితులకు చికిత్స సమయంలో కంపెనీ వేతనం అందిస్తుందని చెప్పారు. పోరస్‌ పరిశ్రమను తాత్కాలికంగా మూసేస్తున్నామని తెలిపారు. కంపెనీ రూల్స్ ఉల్లంఘించిందా లేదా అనే అంశంపై విచారణ చేపట్టామని కలెక్టర్‌ వివరించారు. ప్రమాదకర రసాయనాలు వినియోగించారా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. 


కంపెనీ నుంచి కూడా రూ.25 లక్షలు పరిహారం: ఎమ్మెల్యే
ఏలూరు ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, కంపెనీ తరఫున రూ.25 లక్షల పరిహారం అందుతుందని అన్నారు. క్షతగాత్రులకు వెంటనే రూ.లక్ష పరిహారం అందిస్తామని చెప్పారు. బాధితులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.


ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్‌ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని ఆదేశించారు. అలాగే, గాయపడిన వారికి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సహాయం అందాలని ఆదేశించారు.


బుధవారం అర్ధరాత్రి పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో యూనిట్‌-4లో రియాక్టర్ పేలి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన 13 మందిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుల్లో ఐదుగురు బీహార్‌కు చెందిన వారే ఉన్నారు. ఈ ప్రమాదంలో 5 మంది సజీవ దహనం అయ్యారు. 


నూజివీడు డీఎస్పీ, సీఐ, ఇతర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అనిల్ తో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న వాటిపై వివరాలు సేకరించారు.


ఏదైనా రసాయ చర్య ఎక్కువగా జరిగి రియాక్టర్ పేలిందా లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్లాంట్ ఇంచార్జ్ శుక్లా కూడా లోపలే ఉన్నారని, ఆయన కూడా మరణించి ఉంటారని మంటలు అదుపు చేసిన అనంతరం ప్లాంట్ లోపల ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అని కూడా పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్యం అందించాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వైద్యాధికారులను సూచించారు. నూజివీడు డిఎస్పి నేతృత్వంలో పోలీసులు ఫ్యాక్టరీ ఆవరణలో ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.