AP Elections News: కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 


ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి ఎన్నికల కమిషన్ కు అనేక ఫిర్యాదులు అందాయి. నిర్దేశిత పనికి బదులుగా, వారు రాజకీయ ప్రచారం/రంగంలోకి ప్రవేశిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని కమిషన్ గుర్తించింది. వివరణాత్మక సమీక్ష తదుపరి ప్రభుత్వ మంత్రికి వర్తించే విధంగా ఈ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. కమిషన్ ఈ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘిచినా తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలను తీసుకోవడం కూడా జరుగుతుంది’’ అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


ఇప్పటిదాకా ఎన్నికల వేళ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందా లేదా అనే దానిపై సందేహం ఉండేది. ఎందుకంటే ఏపీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తరచూ విపక్షాలపై రాజకీయపరమైన విమర్శలు చేయడం.. చర్చనీయాంశం అయింది. తరచూ ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ, బీజేపీని విమర్శిస్తున్నారు. చివరికి ప్రధాని మోదీ సభపైన కూడా కామెంట్లు చేశారు. కానీ ఆయనకు ఏ రూల్స్ వర్తించవా అంటూ విపక్షాలు కూడా ప్రశ్నించాయి. సలహాదారులు ప్రభుత్వ జీతం అంటే ప్రజా ధనాన్ని జీతంగా తీసుకుంటున్నారు కాబట్టి.. వారికి కోడ్ వర్తిస్తుందని విపక్షాలు వాదించాయి. 


దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశాయి. తాజాగా ఈ అంశంపై ఈసీ స్పందించింది. తాజాగా ఈ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది.