KCR Comments in Sultanpur Meeting: నారాయణపేటలో జరిగిన కాంగ్రెస్ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదని అన్నారు. నిన్న జ‌రిగిన అంబేడ్కర్ జ‌యంతి రోజున ఆయన్ను అవ‌మానించారని కేసీఆర్ విమర్శించారు. క‌నీసం అంబేడ్కర్ విగ్రహానికి నివాళుల‌ర్పించ‌లేదని అన్నారు. సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన జ‌హీరాబాద్, మెద‌క్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.


మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిపించిన మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. బీఆర్ఎస్ కు లోక్ సభ సీట్లు ఎందుకు అని తెలివి లేని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే బీఆర్ఎస్ కు లోక్ సభలో ఎక్కువ సీట్లు కావాల్సిన అవసరముంది. బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోగలుగుతాం. 


అప్పుడప్పుడు లిల్లిపుట్ గాళ్లకు అధికారం
రాజకీయాల్లో అప్పుడప్పుడు లిల్లిపుట్ గాళ్లకు అధికారం వస్తది. ప్రజలు మంచి చేయమని అధికారం ఇస్తే.. అడ్డదిడ్డమైన పనులు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత మొదటి సారి అంబేడ్కర్ జయంతి వస్తే కనీసం అక్కడ నివాళులు అర్పించలేదు. ఇది అహంకారమా? కండ కావరమా? అంబేడ్కర్ పేరుతో సచివాలయం పేరు ఉంది కదా.. మరి అక్కడ ఎందుకు ఉంటున్నారు.


యాదగిరి గుట్ట, ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా బీఆర్ఎస్ కట్టించింది. మిషన్ భగీరథ కాల్వలు కూడా లేకుండా చేస్తారా? బీఆర్ఎస్ కట్టించిన సచివాలయంలో సిగ్గు లేకుండా ఎందుకు కూర్చుంటున్నారు? యాదగిరి గుట్టకు వెళ్లి దేవున్ని ఎందుకు మొక్కుతున్నారు? సంగమేశ్వర, బసవేశ్వరతో జహీరాబాద్ కు నీళ్లొచ్చే విధంగా చేసుకున్నాం. ఎందుకు దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినారో చెప్పాలె. అంబేడ్కర్ ను అవమానిస్తే, దళిత బంధు బంద్ పెడితే ఊరుకుందామా దళిత మేధావులు చెప్పాలె. ఎలక్షన్స్ వస్తే ఆగమాగం కావొద్దు. పిచ్చి పిచ్చిగా ఓటు వేయొద్దు. 


మొన్న వాళ్లు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలె. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంత గౌరవం, ఎంత జీతం ఇచ్చామో గుర్తుచేసుకోవాలె. మీరంతా మేధావులు, తెలివైన వాళ్లు ఆలోచించి ఓటు వేయకపోతే నష్టపోయేది బీఆర్ఎస్ కాదు. మీరే. 9 ఏళ్లలో రెప్ప పాటు కరెంట్ పోకుండా చేసినం. ఇప్పుడు కరెంట్ ఉంటుందా?


రైతు బంధు రాలేదు
కరెంట్ గతంలో మాదిరిగా రావాలంటే మెదక్, జహీరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలె. బీఆర్ఎస్ లక్ష ఇస్తే మేము రూ. 2 లక్షలు ఇస్తా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు. రాష్ట్రం ఇప్పుడు ఇట్లగే ఉండాల్నా. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలె. పదేళ్లలో రైతుల కోసం ఓ పాలసీ పెట్టుకొని పనిచేసినం. రైతుబంధే ఇప్పటికీ చాలా మందికి రాలే. పంట కొనే దిక్కు లేదు.  


రైతు బంధు అడిగితే చెప్పుతో కొడుతా అని ఓ మంత్రి అంటాడు. లిల్లిపుట్ గాళ్లు.. మెడల పేగులు వేసుకుంటా, పండబెట్టి తొక్కుతా, చెడ్డీలు లాగేస్తా అని మాట్లాడుతున్నారు. పోలీసులు అరాచకాలు బంద్ చేయలే. లేదంటే బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత మీ గతి ఏమైతదో ఆలోచించుకోవాలె. మేం పదేళ్లు అధికారంలో ఉన్నాం. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయలే. పోలీసులతో చేయించాలె. మేము అన్ని రికార్డ్ చేస్తున్నాం. ప్రజల స్పందన చూసైన పోలీసులు మారాలె. లేదంటే పోలీసులారా ప్రజలే మీపై తిరుగబడుతారు. 


రుణమాఫీ తొలుత డిసెంబర్ 9 అన్నది పోయింది. ఇప్పుడు ఆగస్ట్ 15 అంటున్నారు. వీళ్ల మెడలు వంచి రూ. 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ ది. గతంలో రైతులు ఎంతగా ధీమాగా ఉండే. ఇప్పుడు ఆగమైపోయినం. నేనున్నప్పుడు రైతులకు రైతు బంధు ఎట్ల వచ్చింది. నీళ్లు, కరెంట్ ఎట్ల ఉండే, పంట కొనుగోళ్లు ఎప్పటికప్పుడు చేసినం. ఇప్పుడు రైతు బంధు లేదు. పంట కొనుగోలుకు దిక్కు లేదు. కరెంట్ లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 


ప్రభుత్వం ఏడాది కూడా ఉండదనిపిస్తోంది
నారాయణ పేట సభలో రేవంత్ రెడ్డి భయం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదనిపిస్తంది. ఫస్ట్ రేవంత్ రెడ్డే బీజేపీ లో జంప్ కొడుతాడు అనిపిస్తోంది. ఢిల్లీ కి వెళ్లి బీజేపీకి ఓటు వేయమని...రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. బీజేపోళ్లు మనకు అక్కరాని చుట్టాలు. బీజేపీ కి ఓటు వేసినా మంజీర నదిలో వేసిన ఒక్కటే. ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వని బీజేపీ కి ఓటు ఎందుకు వేయలే. యువకులు ఆగమాగమై ఓటు వేస్తే నష్టపోయేది మనమే. తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడే బీఆర్ఎస్ నే గెలిపించాలె. మెదక్ అభ్యర్థిగా వెంకట్రామి రెడ్డిని, జహీరాబాద్ లో అనిల్ కుమార్ ను గెలిపించాలని కోరుతున్నా. మీ ఆశీర్వాదంతో మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ను తీసుకొస్తా’’ అని కేసీఆర్ అన్నారు.