CM Jagan : ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు రావడం శుభపరిణామమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిమ్ పరిశ్రమ కాస్టిక్ సోడా యూనిట్ ను గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి  సీఎం జగన్‌ గురువారం ప్రారంభించారు. రాష్ట్రంపై నమ్మకం ఉంచి గ్రాసిమ్‌ కంపెనీ ద్వారా రూ.2 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నందుకు సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. ఈ యూనిట్ లో 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమ అంగీకరించిందన్నారు. ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా 1300, పరోక్షంగా 1150 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. గతంలో ఈ పరిశ్రమ ఏర్పాటుపై గ్రామస్థులు ఆందోళన చేశారని, కలుషిత వ్యర్థాలు నేరుగా వదలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చాక అంగీకరించారన్నారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా పరిశ్రమ నిర్మించేలా చర్యలు తీసుకున్నామన్నారు. గ్రాసిమ్‌ సంస్థ అందించే సీఎస్‌ఆర్‌ నిధులు స్థానికంగా ఖర్చుచేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 


జీరో లిక్విడ్ వేస్ట్ డిశ్చార్చ్ 


గ్రాసిమ్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేసినప్పుడు 131 మందిపై కేసులు నమోదయ్యాయని సీఎం జగన్ తెలిపారు. ఆందోళనకారులపై పెట్టిన ఆ కేసులను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. ఇవాళ కేసుల ఎత్తివేతపై జీవో విడుదల చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఎన్నికలకు 2 నెలల ముందు గత ప్రభుత్వం గ్రాసిమ్‌ సంస్థకు ప్రాజెక్టు అప్పగించిందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక సమస్యలు పరిష్కారించకుండా సంతకాలు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చర్యలు చేపట్టిందన్నారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఆధునిక సాంకేతికతో పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెక్నాలజీ మార్పు ద్వారా జీరో లిక్విడ్‌ వేస్ట్‌ డిశ్చార్జ్‌ అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామస్థుల భయాలకు తావులేకుండా ఈ పరిశ్రమ నెలకొల్పారని సీఎం జగన్‌ పేర్కొన్నారు.






Also Read : Chandrababu : ఏపీలో దొంగల్లా పోలీసులు - వైఎస్ఆర్‌సీపీ నేతలు తెమ్మంటే మహిళల్నీ తీసుకెళ్లిపోతారా? : చంద్రబాబు