Eluru: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు నలుమూలల నుంచి తరలివస్తారు.  ఇక్క‌డ వేంక‌టేశ్వ‌ర స్వామి స్వ‌యంభూగా ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్లు స్థ‌ల‌పురాణం చెబుతుంది. ఇప్పుడు ద్వారకా తిరుమల ఆలయంలో ప్రసాదాల వివాదం కలకలం రేపుతోంది.  ఇటీవల ఓ భక్తులు తీసుకున్న పులిహోర ప్రసాదంలో పురుగు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ద్వారకాతిరుమల చిన్న  వెంకన్న పులిహొర ప్రసాదంలో పురుగు ఘటన కలకలం రేపింది. దీంతో ఆలయ ఈవో త్రినాధ రావు స్పందించారు. 


తయారీ కేంద్రంలో తనిఖీలు
వెంటనే ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రసాద తయారీ కేంద్రం పరిశుభ్రంగానే ఉన్నట్లు ఈవో వెల్లడించారు.  తయారీ కేంద్రం నుంచి ప్రసాదం కౌంటర్లకు తరలించే టైంలో ట్రాన్స్ పోర్టు సమయంలో పురుగు పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేశారు.  అంతేకాకుండా సంబంధిత సెక్షన్ ఏఈఓ, సూపరిండెండెంట్, సిబ్బందికి సంజాయిషీ  కోరుతూ మెమో జారీ చేశారు. 


ఆలయానికి మరో పేరు శేషాచలం 
క‌లియుగ దైవ‌మైన‌టువంటి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి సంబంధించిన దివ్య క్షేత్రాల్లో ద్వార‌కా తిరుమ‌ల చాలా ప్ర‌త్యేక‌మైంది. . ద్వార‌కా అనే ముని చీమ‌ల పుట్ట నుంచి వేంక‌టేశ్వ‌ర స్వామిని వెలికి తీయ‌డం చేత ఈ ఆల‌యానికి ద్వార‌కా తిరుమ‌ల క్షేత్రమ‌ని పేరు వ‌చ్చింద‌ని చెబుతారు.  ద్వారకా తిరుమల క్షేత్రానికి పౌరాణికంగా శేషాచలమని పేరుంది. ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహాలున్న అరుదైన క్షేత్రం ఇది. దక్షిణాభిముఖుడై వేంకటేశ్వరుడు వెలసినందు వల్ల నిత్యం ఉత్తరద్వార దర్శనమిస్తాడు. గర్భాలయానికి కుడివైపు అర్ధమంటపంలో తూర్పుముఖంగా పద్మావతీ, ఆండాళ్ అమ్మవార్లు కొలువై ఉంటారు. గర్భాలయంలో ఇద్దరు ధృవమూర్తులు ఉంటారు. కనుక ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.


స్వయంభూగా వెలిసిన స్వామి


స్వామి వారు స్వయంభూగా వైశాఖ మాసంలో దర్శన మిచ్చినందువల్ల వైశాఖ మాసంలోనూ స్వామివారికి ఇక్క‌డ‌ కళ్యాణం జరుగుతుంది. అలాగే సంపూర్ణ విగ్ర‌హాన్ని ఆశ్వియుజ మాసంలో ప్ర‌తిష్ఠించినందు చేత ఆ మాసంలోనూ స్వామికి మరోసారి కళ్యాణం నిర్వహించడం ఆలయ సంప్రదాయం. ద్వారకా తిరుమలేశుని వైశాఖ కళ్యాణ ఉత్సవాలు వైఖానస ఆగమ పద్ధతిలో పాంచరాత్ర దీక్షతో నిర్వహిస్తారు. ఆ ఎనిమిది రోజులు పాటు ఆలయంలో ఆర్జిత సేవలను, నిత్యకల్యాణోత్సవాలను రద్దు చేస్తారు. ఉత్స‌వాలు జ‌రిగిన‌న్ని రోజులు స్వామివారు రోజుకోక వాహ‌నంపై ద్వార‌కా వీధుల‌లో.. వివిధ అలంకారాల‌తో ఊరేగుతారు.