YS Jagan Siddham Sabha at Medarametla in Bapatla District: మేదరమెట్ల: వైసీపీ నిర్వహిస్తున్న నాలుగో సిద్ధం సభకు బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికైంది. ఆదివారం నిర్వహిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సిద్ధం సభకు భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి వచ్చారు. ఏ ఇబ్బందులు కలగకుండా ఉండేలా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. జగన్ ప్రసంగం ప్రతి ఒక్కరికీ కనిపించేలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈసారి సభలో కొత్త కాన్సెప్ట్ వై ఆకారంను చూపించారు. వైనాట్ 175 అని అర్థం వచ్చేలా వైసీపీ ప్లాన్ చేసింది. నా కల పేరుతో సీఎం జగన్ ఈ సభకు శ్రీకారం చుట్టారు. వైసీపీ తాజాగా నిర్వహిస్తున్న సిద్ధం సభ (Siddham Sabha at Medarametla)లో ఓ డ్రోన్ కలకలం రేపింది. ఒకట్రెండు నిమిషాల తరువాత డ్రోన్ కనిపించలేదని సమాచారం.


మేదరమెట్లలో నిర్వహిస్తున్న సిద్ధం సభలో మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు. నిర్వాహకులు వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తమ సభపై కొందరు కుట్ర చేస్తున్నారేమోనని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. తమ అనుమతి లేకుండా కొందరు డ్రోన్లు ఎగరవేసి కుట్రకు యత్నిస్తున్నారని ఆరోపించారు. డ్రోన్లతో తమను భయపెట్టలేరని, దమ్ముంటే రాజకీయంగా తమను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.



అనంతరం వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పప్పూ ఎక్కడో దూరంగా ఉండి, డ్రోన్లు పంపించడం కాదు.. దమ్ముంటే ఇక్కడికి వచ్చి సభను.. జనాన్ని చూడాలన్నారు. లక్షలాది మంది సాక్షిగా తొక్కేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు చేసే నినాదాల శబ్ధానికి చచ్చిపోతావ్ బిడ్డా అంటూ లోకేష్‌ను ఉద్దేశించి మాట్లాడారు.  టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన తరువాత జగన్ నిర్వహిస్తున్న సభ కావడంతో ఆయన ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. మేనిఫెస్టోపై ప్రకటన చేస్తారా అని రాష్ట్ర ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.