Deputy CM Pawan Kalyan:  మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాల కారణంగా నిరుద్యోగం, అంతర్గత భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ అంశంపై ఏపీ చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీకి కూడా లేఖ రాశారు  గన్నవరం ఎయిర్ పోర్టులో  తన లేఖ అంశంపై మీడియాతో మాట్లాడారు.  సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకం. దీనిపైనే రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ లేఖ రాశానని  తెలిపారు. 

దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యం అని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిందని .. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని చెప్పారు. పాలనా యంత్రంగంతో సమన్వయం చేసుకొని ఉగ్రవాద జాడలు కలిగిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించాననని ముఖ్యంగా వలసదారుల విషయంలో తగిన నిఘాను ఉంచితే జరగబోయే ప్రమాదాలను నివారించవచ్చునని స్పష్టం చేశారు. తీరంలో కొత్త వ్యక్తుల కదలికలు, వారి చర్యలను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు అజాగ్రత్తగా ఉండకుండా అంతర్గత భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 

రోహింగ్యాల మూలాలు మయన్మార్ లో ఉన్నాయి. అక్కడి  పశ్చిమ బెంగాల్ వైపు .. అక్కడి   ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాలు వలస వచ్చారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో  చాలా అధికంగా వీరి వలస జరిగింది.  ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారు. మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు. రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉంది. వారికి ఎలా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు వస్తున్నాయి..? ఎవరు ఇస్తున్నారనేది తేలాలి. మన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు వారికి సహకరిస్తున్నారని అర్ధం అవుతుంది. రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా మారి, మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై అందరిలోనూ చైతన్యం రావాలి. రోహింగ్యాలు స్థానికులుగా మారడానికి సహరిస్తున్న యంత్రాంగంపై కన్నేసి ఉంచాలని, అంతర్గత భద్రతలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు బాధ్యత గల ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా  లేఖ రాశానని తెలిపారు.  సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులు పంట పొలాల్లోకి వస్తూ పంటకు, పొలాలలో ఉన్నవారి ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల అలాంటి ఘటనలు చూశాం. ముఖ్యంగా చిత్తూరు, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈ సమస్య ఉంది. వీటికి పరిష్కారంగా గతంలోనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 6 కుంకీ ఏనుగుల కోసం ఒప్పందం చేసుకున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన ఇవ్వనుంది. కుంకీ ఏనుగుల ద్వారా మదపుటేనుగుల విధ్వంసం నుంచి బయటపడగలం అనే నమ్మకం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సహకారం కర్ణాటక ప్రభుత్వం అందించడం అభినందనీయం. దీంతో ఏనుగులతో వస్తున్న సమస్య చాలా వరకు తీరుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.