ED Notice To Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అరెస్టు చేసింది. ఆయన తీహాడ్ జైల్ లో ఉన్నారు. 


అరుణ్ పిళ్లైకి కస్టడీకి పొడిగింపు 


దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే దిల్లీ లిక్కర్ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. దిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో మరింత వేగం పెంచింది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ కోర్టులో హాజరుపర్చింది. ఆయనకు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. విచారణ ఇంకా పూర్తి కాలేదని, మరికొన్ని రోజులు విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు మాత్రం అరుణ్ రామచంద్ర పిళ్లైని మూడు రోజుల పాటు మాత్రమే కస్టడీకి అనుమతించింది.


మాగుంట రాఘవ అరెస్ట్ 


 దిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేస్తున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న కీలక నేతలను సీబీఐ అరెస్టు చేస్తుంది. ఈ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఫిబ్రవరి 10న ఈడీ అరెస్టు చేసింది. ఆయనకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇప్పటికే పలుమార్లు మాగుంట రాఘవ కస్టడీ పొడిగించింది కోర్టు. మాగుంట రాఘవ ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్నారు.  


రూ.100 కోట్ల ముడుపులు 


 దిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డిని ఫిబ్రవరి 10న  ఈడీ అరెస్టు చేసింది. అనంతరం దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో ఈడీ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ రెడ్డి పేర్లను ప్రస్తావించింది.  దిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సౌత్‌ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులను విజయ్ నాయర్ సేకరించి ఆప్ నేతలకు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. సౌత్ గ్రూప్‌లో శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి నివాసాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు కూడా నిర్వహించాయి.   


ఎమ్మెల్సీ కవిత మరోసారి నోటీసులు


దిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఈడీ కోరింది. దర్యాప్తులో భాగంగా కవిత గురువారం ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆరోగ్యం బాగాలేదని, ఇవాళ హాజరుకాలేనని ఈడీ అధికారులకు ఆమె లేఖ పంపిన విషయం తెలిసిందే. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. విచారణకు మరో తేదీని ఖరారు చేస్తూ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అరుణ్‌ పిళ్లై కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఆయను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో మూడు రోజులు అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగించింది కోర్టు. అయితే ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరుకావాలని ఇచ్చిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారు కానీ, అలా చేయలేదన్నారు. అయితే కవిత పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం నిరాకరించారు. ఈ పిటిషన్ పై తదుపరి వాదనలు ఈనెల 24కు వాయిదా వేసింది.