Revanth Reddy Comments on Kadapa Bypoll: ఈ మధ్య కడప పార్లమెంటుకు ఉప ఎన్నిక వస్తుందని పేపర్లలో వస్తుందని.. నిజంగా కడప పార్లమెంటుకు ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరిగే బాధ్యత తాను తీసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఏ కడప జిల్లా నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభ తగ్గిపోయిందో మళ్లీ అదే స్థానం నుంచి పార్టీని నిలబెట్టే బాధ్యత తీసుకుంటానని అన్నారు. మంగళగిరిలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సభకు రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో సహా హాజరయ్యారు.


తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల గురించి చర్చ జరిగినప్పుడు కచ్చితంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు రాజకీయ నాయకుల తరహాలో వైఎస్ఆర్ పేరును ఎవరూ మర్చిపోలేరని.. ఆయన దూరమై 15 ఏళ్లు అయినప్పటికీ వైఎస్ జ్జాపకాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ రావాల్సి ఉన్నా ప్రస్తుతం ఆయన మణిపూర్ పర్యటన కారణంగా హాజరు కాలేకపోయారని అన్నారు.


‘‘మొదటిసారి 2007లో నేను ఎమ్మెల్సీ అయినప్పుడు.. మండలిలో వివిధ అంశాలను ప్రస్తావించడం కోసం నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యి వైఎస్ ముందు సమస్యలను ప్రస్తావించేవాడిని. 2009లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నన్ను ప్రోత్సహించేవారు. నేను ఏకధాటిగా 40 నిమిషాలు మాట్లాడుతున్నప్పటికీ మధ్యమధ్యలో చాలా ఓపిగ్గా వైఎస్ నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు. సభలోకి కొత్త సభ్యులు వస్తే.. కొత్త వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే.. కొత్త వారిలో నాయకత్వం మరింత బలపడుతుంది. వారు శాసనసభలో వ్యవహరించిన తీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.


వైఎస్ స్ఫూర్తిని షర్మిల కొనసాగిస్తోంది
వైఎస్ఆర్ తొలిసారిగా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకూ 1400 కిలో మీటర్ల మేర ఎర్రటి ఎండలో పాదయాత్ర చేశారు. అదే స్ఫూర్తితో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. 2004లో తిరుగులేని నాయకుడిగా వైఎస్ అధికారంలోకి వచ్చారు. 2004లో రాజశేఖర్ రెడ్డికి ముఖ్యమంత్రిగా పదోన్నతి వస్తే.. నేను అదే ఏడాదిలో రాజకీయ అరంగేట్రం చేశా. దాదాపు 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి.. 2024లో ముఖ్యమంత్రి హోదాలో మీ ముందు ఉన్నా. ఇలాగే వైఎస్ షర్మిల కూడా 2009 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇక్కడ ఏపీలో ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. 1999లో ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ ఎలాగైతే వ్యవహరించారో.. ఇప్పుడు ఏపీ ప్రజల తరపున వైఎస్ షర్మిల కొట్లాడుతుంది. 1999 నాటి వైఎస్ స్ఫూర్తిని ఇప్పుడు వైఎస్ షర్మిల కొనసాగిస్తుంది. 


2029లో ఏపీకి షర్మిల సీఎం, రాహుల్ దేశానికి పీఎం
ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అంటే బాబు - జగన్ - పవన్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. మొత్తం పాలకపక్షమే. ఉన్న ముగ్గురూ పాలకపక్షమే. మరి ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన కొట్లాడేందుకు వైఎస్ షర్మిల మాత్రమే ఉన్నారు. 2029లో వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతారు. అదే ఏడాదిలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు. ఇదే వైఎస్ చివరి కోరిక. చాలా మంది ఆయన పేరు మీద లాభపడ్డారు. ఆశయాలను మోసేవాళ్లనే అసలైన వారసులుగా గుర్తించాలి. వైఎస్ పేరు మీద వ్యాపారాలు చేసేవారు వారసులు అవుతారా? ఏపీలో కాంగ్రెస్ ముళ్లబాట అని తెలిసినా ఆ పార్టీ బాధ్యతలు షర్మిల తీసుకున్నారంటే.. అది వైఎస్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకే. ఏపీ కాంగ్రెస్ కు మా తెలంగాణ మంత్రివర్గం మొత్తం అండగా నిలబడుతుంది. అందుకే మేం అందరం ఈ సభకు హాజరయ్యాం’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.