టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ముసలాయనగా అభివర్ణించారు. ఇప్పడు ఎక్కడబడితే అక్కడ ఫోటోలు దిగుతూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ అంటున్నారని విమర్శించారు. టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి ఫోటోలు దిగుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక, ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా సొమ్ము డీబీటీ విధానం ద్వారా వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశామని గుర్తు చేశారు. మరి చంద్రబాబు హాయాంలో ఆ డబ్బు అంతా ఏమైందో అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ జరిగిన మంచి ఎంత అనేది బేరీజు వేసుకొనే సత్తా నీకు ఉందా చంద్రబాబు అని నిలదీశారు. ఈ నిజాలు మనిషి మనిషికీ తెలుసని అన్నారు.


ఇలాంటి చంద్రబాబు ఇంటింటికీ స్టిక్కర్ వేయడానికి అర్హుడా అని ప్రశ్నించారు. ఇళ్ల ముందు సెల్ఫీ దిగే నైతికత గానీ, స్టిక్కర్ అతికించే అర్హత కానీ చంద్రబాబు ఉందా అని అక్కచెల్లెమ్మలు ప్రశ్నించాలని సీఎం జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కాలేజీ మైదానంలో బుధవారం (ఏప్రిల్ 12) బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.


‘‘రుణ మాఫీ చేస్తానని రైతులను చంద్రబాబు మోసం చేశారు. సెల్ఫీ ఛాలెంజ్‌ అంటే నాలుగు ఫేక్‌ ఫోటోలు కాదు బాబు.. సెల్ఫీ ఛాలెంజ్‌ అంటే ప్రతి ఇంటికి వెళ్లి ఏం చేశారో చెప్పండి. ప్రజలు మంచి చేశారు అని చెబితే అప్పుడు సెల్ఫీ తీసుకోవాలి. దాన్ని మంచి సెల్ఫీ అంటారు. ఏం మంచి చేశారని ఇంటి ముందు స్టిక్కర్స్ అంటించాలి? ఇదే విషయం చంద్రబాబుని నిలదీయండి. దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదు. రెండేళ్లలో రూ.1,258 కోట్లు ఈబీసీ నేస్తం ద్వారా మహిళల ఖాతాల్లో జమ చేశాం. ఈబీసీ నేస్తం లాంటి పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ మాట్లాడారు.


రూ.658.60 కోట్లు ఖాతాల్లోకి..


వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేద మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తూ వారి బాగుకోసం పాటు పడుతున్నామని సీఎం జగన్ అన్నారు. తాను అందిస్తున్న ఆర్థిక సాయం ద్వారా అక్కచెల్లెమ్మలు ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలు అని అన్నారు. అలాంటి అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌ చేస్తున్నానని, వీరికి భరోసా ఇచ్చే కార్యక్రమం ఈబీసీ నేస్తం అని అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కాలేజీ మైదానంలో బుధవారం (ఏప్రిల్ 12) బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.


జగనన్న ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో  రూ.15 వేలు జమ చేశారు.