కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా కృష్ణాజలాల అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని అమిత్ షాను కోరారు. 


సుప్రీంకోర్టులో 5 స్పెషల్ లీవ్ పిటిషన్లు పెండింగ్
క్రిష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ,  సుప్రీంకోర్టులో 5 స్పెషల్ లీవ్ పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  గతంలో ఇదే అంశంపై 17.08.2021న, తర్వాత 25-06-2022న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. క్రిష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్-IIకి విధివిధానాల జారీకి, ఈ నెల 4.10.2023న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు సీఎం జగన్.  ఈ నిర్ణయంతో ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. విధివిధానాలను బేసిన్‌లోని కర్ణాటక, మహారాష్ట్రలకు కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పరిమితం చేయడం అశాస్త్రీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలన్నారు. 


పోలవరంకు నిధులు విడుదల చేయండి
పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపైనా చర్చించారు సీఎం జగన్‌.  ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని అభ్యర్థించారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 55,548.87 కోట్లుగా ఉందన్నారు. ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు, నిధులు విడుదలచేయాలని అమిత్ షాను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు విజ్క్షప్తి చేయడంతో రూ.12,911.15 కోట్ల విడుదలకు  ఆమోదం లభించిందన్నారు. అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామన్నారు జగన్. 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కోరారు. 


అంతకు ముందు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి సీఎం హాజరయ్యారు. ఈ సదస్సులో బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.