ఒక్క సినిమా.. ప్రేక్షకుల ముందుకు రావాలంటే 24 క్రాఫ్ట్స్ కలిసి పనిచేయాల్సిందే. ఆ 24 క్రాఫ్ట్స్ సరిగా కలిసి ముందుకు కదిలితేనే.. దర్శకుడు అనుకున్నట్టుగా సినిమా పూర్తవుతుంది. ఆ క్రాఫ్ట్స్‌లో ఎడిటింగ్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ ఎడిటర్‌గా పేరు తెచ్చుకున్నారు మార్తాండ్ కే వెంకటేశ్. సీనియర్ హీరోలు సైతం తమ సినిమాలకు ఆయనే ఎడిటర్‌గా పనిచేయాలని ఎదురుచూసే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి మార్తాండ్.. ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి ముక్కుసూటిగా కొన్ని నిజాలు చెప్పారు. ఇండస్ట్రీలో పలకరింపులు అనేవి ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయి, నాగార్జున, నాగచైతన్యలతో ఆయన బంధం ఎలా ఉంటుంది అనేదాని గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.


కథ వినకుండానే..


ఎడిటింగ్ అనేది బాగుంటేనే దర్శకుడు చెప్పాలనుకున్న కథ పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అర్థమవుతంది. అయితే ఒక ఎడిటర్‌గా తాను కథను ముందే వినడానికి ఇష్టపడను అంటున్నారు మార్తాండ్ కే వెంకటేశ్. కథను ముందే వినేస్తే.. ఈ సీన్ తర్వాత ఆ సీన్ అన్నట్టుగా అంచనా వేస్తామని, అలా వేయడం తనకు ఇష్టం లేదని అన్నారు. అలా కథ వినకుండా ఎడిట్ చేసిన సినిమాలే అప్పుడప్పుడు బ్లాక్‌బస్టర్స్ అయ్యాయని గుర్తుచేసుకున్నారు. అందులో ‘లీడర్’ చిత్రం కూడా ఒకటని అన్నారు. సీనియర్ ఎడిటర్ అయినా కూడా అప్పుడప్పుడు మేకర్స్‌తో మనస్పర్థలు వస్తే.. సినిమాలు నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘గుడుంబ శంకర్’ చిత్రం నుంచి కూడా ఆయన అలాగే తప్పుకున్నారు. అంతే కాకుండా అలాంటి మరికొన్ని అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.


ఒక హీరో అలా చేశాడు..


‘‘ఒక చిన్న హీరో. ఆయనతో కలిసి నాలుగైదు సినిమాలు చేశాను. అవన్నీ హిట్ అయ్యాయి. ఆయన కూడా ఒక స్థాయికి వచ్చారు. ఒకరోజు ఆయన అన్నపూర్ణ స్టూడియోకు వచ్చినప్పుడు నేను చూసుకోకుండా ఆయనను పలకరించలేదు. దీని గురించి నాకు ఫోన్ చేసి దాదాపు 15 నిమిషాలు గొడవ పెట్టుకున్నారు. పలకరించకుండా వెళ్లిపోయావు అంటూ అమ్మ, నాన్న గురించి మాట్లాడాడు. నాకు కోపమొచ్చి పలకరించడం గురించి ఇంత పెద్ద గొడవ చేస్తున్నావు. మీ అమ్మ, నాన్న ఎలా పెంచారు అని అడిగారు. అలా ఆయన సినిమా మధ్యలో నుంచి తప్పుకున్నాను’’ అంటూ ఒక హీరోతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టారు మార్తాండ్ కే వెంకటేశ్.


నాగార్జున, నాగచైతన్య పట్టించుకోరు..


1999 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి పనిచేస్తున్నా నాగార్జున ఎప్పుడూ పలకరించలేదని అన్నారు మార్తాండ్. రోజూ పలకరించడం లాంటిది ఏమీ ఉండదని, పైగా తాను కూడా నాగార్జునను పట్టించుకోకుండానే వెళ్లి తన పని తాను చేసుకుంటానని అన్నారు. నాగార్జున మాత్రమే కాదు.. నాగచైతన్యతో కూడా తన బంధం ఇలాగే ఉంటుందన్నారు. ఒకవేళ నాగార్జున తనతో ఏమైనా మాట్లాడాలనుకుంటే పర్సనల్‌గానే మాట్లాడతారని, పిలుస్తారని, ఆ తర్వాత ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అవమానాలు అనేవి చాలా చూశానని, ఇప్పుడు తనకు అన్నీ అలవాటు అయిపోయాయని అన్నారు మార్తాండ్ కే వెంకటేశ్. అంతే కాకుండా ఒక డైరెక్టర్‌కు లేదా హీరోకు సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోతే చూడడానికి చాలామంది వెళుతున్నారని, కానీ ఒక పాత నటుడు చనిపోతే మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.


Also Read: హీరోగా యాంకర్ సుమా కొడుకు - రోషన్ కనకాలకు రాజమౌళి ఇచ్చిన సలహా ఇదే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial