అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా రాజకీయం చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి ఉండదని కూడా పార్టీ వర్గాలకు సంకేతాలు పంపుతున్నారు. అందులో భాగంగానే ప్రధానమయిన అభ్యర్థుల జాబితా పై క్లారిటి ఇవ్వటం ద్వారా ఎన్నికల పై పూర్తి ఫోకస్ పెట్టేందుకు ఆస్కారం ఉంటుందని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ప్రకటన పై కూడా పూర్తి ఫోకస్ పెట్టారని అంటున్నారు. దసరా తరువాత ఎన్నికలకు సిద్దం అయ్యే క్రమంలో ముందుగా తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఛాన్స్ లేకపోలేదని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.


ఫస్ట్ లిస్ట్ లో 72 మంది...


అధికార పార్టీలో అసెంబ్లి సీట్ అంటే ఆషామాషీ కాదు. అయితే గతంలో జగన్ కూడా అనేక సార్లు స్పష్టంగా అభ్యర్థుల ఎంపిక పై క్లారిటి ఇచ్చారు. ఇప్పుడున్న అసెంబ్లి స్దానాలకు చెందిన శాసన సభ్యులు, ఇంచార్జ్ లు తిరిగి గెలుచుకు రావాలని అప్పుడు తిరిగి వారికి మంత్రి పదవులు ఉంటాయని తొలి మంత్రి వర్గంలోనే జగన్ చెప్పిన మాటలు ఇప్పటికే పార్టీలో మారుమోగుతున్నాయి. సో అభ్యర్ధుల వ్యవహరంలో జగన్ క్లారిటి గా ఉన్నారని అంటున్నారు. అందులో భాగంగానే మెదటి జాబితాలో 72 మంది అభ్యర్థుల జాబితా రెడీ అయ్యిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే 72 మంది లో పాత వారే 50 మంది ఉన్నారని చెబుతున్నారు. జగన్ చేసేదే చెబుతారు, కాబట్టి ఆయన గతంలో చెప్పిటనట్లుగానే సిట్టింగ్ లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని కూడా పార్టీ  వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ జాబితాను దసరా తరువాత అధికారికంగా ప్రకటించే ఛాన్స్ లు ఉన్నాయని అంటున్నారు.


అభ్యర్థుల పై నే పూర్తి భారం...


పార్టీ కోసం పని చేసిన వారిని, తనకు విధేయులుగా ఉన్నవారికి జగన్ ఫుల్ సపోర్ట్ చేస్తారని అనేక సందర్బాల్లో వెల్లడయ్యింది. సో పార్టీ తరపున నియోజకవర్గాల్లో అసెంబ్లి సీట్ ను ఆశించిన చాలా మందికి జగన్ సీటు కేటాయించలేని పరిస్దితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ లు పాతుకుపోయి ఉండటం , తిరిగి పార్టీని గెలిపించే కీలక బాధ్యతలు సైతం జగన్ వారికే అప్పగించటంతో  వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేదే ప్రమాణికంగా భావిస్తున్నారు.   నియోజకవర్గాల్లో నెంబర్ టూ స్దానంలో ఉన్న వారితో పాటుగా, పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్న వారికి ఇప్పటికే నామినేటెడ్ పోస్ట్ లు ఫుల్ గా పంపిణి చేశారు.


ఇక రాబోయే రోజుల్లో సైతం నామినేటెడ్ పదవులు ఎక్కడెక్కడ ఉన్నా వాటిని వెతికి మరి ఆశావహులకు కట్టపెట్టం ద్వారా నియోజకవర్గంలో అసంతృప్తి నేతలను కూల్ చేస్తున్నారు.   ఈ ఫార్ములా ఇప్పుడు ఫుల్ గా వర్కవుట్ అవ్వటంతో, ఇక ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించటం పెద్ద సమస్య కాదని జగన్ భావిస్తున్నారని, పార్టీ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగానే ముందుగా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే, అసంతృప్తులు బయటకు వస్తారు. అలాంటి వారికి ముందుగానే డోర్ లు తెరిచేస్తే, ఎన్నికల నాటికి అలాంటి అసంతృప్తులను కవర్ చేసుకునే వీలు కూడా స్దానికంగా ఉంటుందని పార్టీ అంచనా వేస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.