Andhra News :   ఏపీ ప్రభుత్వం జగనన్న సురక్షా పేరుతో నెల రోజుల పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఓ విస్తృతమైన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకుంది. స్పందన కార్యక్రమంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  జగనన్నకు చెబుదాం వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ అన్నది చాలా ముఖ్యమని అధికారులకు స్పష్టం చేశారు.   ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నామని..   గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే… సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. ఎందుకు రిజెక్షన్‌కు గురైందో వారికి వివరించాలని సీఎం జగన్ ఆదేశించారు.  పరిశీలించని గ్రీవెన్సెస్‌ ఏమైనా ఉంటే.. 24 గంట్లోగా వాటిని పరిష్కరించాలన్నారు. 


ఇందు కోసం ఈనెల 23 నుంచి జులై 2౩ వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.  జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్షా కార్యక్రమం ఉంటుందని..  ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై ఈ కార్యక్రమంలో జల్లెడపడతారన్నారు.  డాక్యుమెంటేషన్‌, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పతకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారని..  సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందిస్తారని సీఎం జగన్ తెలిపారు.  జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించనవారికి ఆగస్టు 1న మంజూరుచేస్తారన్నారు. 


ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు.   ఇందులో 60శాతం పనిదినాలు.. ఈనెలాఖరులోగా పూర్తికావాలన్నారు.  ప్రతిరోజూ ప్రతి జిల్లాలో కనీసం 75వేల పనిదినాలు కల్పించాలని సూచించారు.  నిర్మాణంలో సచివాలయాలు, ఆర్బీకేలు, విజేజ్‌క్లినిక్స్‌, డిజిటల్‌ గ్రంథాలయాలను వెంటనే పూర్తిచేయాలన్నారు.  రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నామని..  ఇప్పటివరకూ సుమారు 3.9లక్షల వరకూ ఇళ్లు పూర్తయ్యాయి... రూఫ్‌ లెవల్‌, ఆపై ఉన్నవి సుమారు 5.27లక్షలు ఉన్నాయ.. వీటిని త్వరతిగతిన పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు.  సీఆర్డయే ప్రాంతంలో ఇళ్లనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేయాలని.. జులై 8 నుంచి పనులు ప్రారంభించాలన్నారు.   ఆప్షన్‌ -3 ఎంపిక చేసుకున్న వారికి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్లు కట్టే నిర్మాణం మొదలుకావాలన్నారు. 
 
వర్షాకాలం ప్రారంభమైనదున విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడాలని ఆదేశించారు.  జులై 1 నుంచి ఇ-క్రాప్‌ బుకింగ్స్‌ ప్రారంభించాలి. సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలి. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.  సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి… కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మొదటి ఫేజ్‌లో 2వేల గ్రామాల్లో జగనన్న భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం పూర్తయ్యిందని సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్‌, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదని స్పష్టం చేశారు. 
 
జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలని జగన్ ఆదేశించారు.  ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువుల బాగోలేకున్నా.. వెంటనే సమాచారం తెప్పించుకోవాలని..  పాఠశాల ప్రదానోపాధ్యాయులనుంచి ఈ సమాచారాన్ని సేకరించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఆరో తరగతి, ఆపై  క్లాసులకు సంబంధించి తరగతి గదుల్లో జులై 12 కల్లా… ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటు కావాని స్పష్టం చేశారు.  వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాలన్నారు.