Chittoor News : వైద్యులంటే భగవంతునికి మరో రూపంగా భావిస్తాం. వైద్యులను దేవుడికి ప్రతిరూపంగా భావిస్తుంటారు. అందుకే వైద్యులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఇస్తుంటారు. అంతటి పవిత్రమైన వృత్తికి కొందరు చెడ్డ పేరును తీసుకొస్తున్నారు. తాజాగా నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ ఐదు రూపాయల కాయిన్ మింగేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.  బాలుడికి చికిత్స అందించేందుకు వైద్యులు నిర్లక్ష్యం వహించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 


అసలేం జరిగింది? 


చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లెకు చెందిన బాలాజీ, అరుణ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు రాకేష్ ఉన్నాడు. బాలాజీ రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. బుధవారం సాయంత్రం తినుబండారాలు కొనుక్కొనేందుకు రాకేష్ కు తల్లి అరుణ ఐదు రూపాయలు ఇచ్చింది. అయితే తల్లి వద్ద డబ్బులు తీసుకున్న రాకేష్ తన స్నేహితులతో ఆడుకుంటూ తన వద్ద ఉన్న ఐదు రూపాయల కాయిన్ ను నోటిలో వేసుకున్నాడు. అలానే ఐదు రూపాయల బిళ్లను మింగేశాడు. నాణెం బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. ఇది చూసిన స్థానికులు రాకేష్ తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. బాలుడు నోటిలో నుంచి నాణెం తీసేందుకు ప్రయత్నించారు కానీ నాణెం బయటికి రాకపోయే సరికి రాకేష్ తల్లిదండ్రులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


గంటల కొద్దీ నిరీక్షణ


బాలుడిని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న సిబ్బందికి చూపించి తన బాలుడు నోటిలో ఐదు రూపాయల నాణెం ఇరుక్కు పోయిందని చెప్పారు. అయితే ఆ సమయానికి వైద్యులు లేకపోయే సరికి వార్డులో ఉన్న నర్సులు బాలుడిని పరీక్షించి డాక్టర్ లేరని, కొంతసేపు వేచి ఉండమని చెప్పారు. ఎంతసేపు వేచి ఉన్నా డాక్టర్ రాక పోయేసరికి వార్డులో ఉన్న నర్సును అడిగారు. వైద్యులు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని వేచి ఉండాలని చెప్పింది. చాలా సేపటి తర్వాత వైద్యులు రావడంతో బాలుడిని డాక్టర్ కు చూపించారు బాలుడి తండ్రి బాలజీ. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు స్కానింగ్ తీయాలని చెప్పి ఆ చీటీని రాసి స్కానింగ్ తీసుకుని వస్తే, దాని రిపోర్ట్ ఆధారంగా నాణెం ఎక్కడ ఉందో గుర్తించి తీసేందుకు వీలు అవుతుందని చెప్పారు. వెంటనే ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్ వద్దకు బాలుడిని తీసుకెళ్లారు బాలాజీ. అక్కడ స్కానింగ్ తీసే సిబ్బంది లేకపోయే సరికి గంటల కొద్ది బాలుడిని పెట్టుకుని తల్లిదండ్రులు నిరీక్షించారు. కానీ సిబ్బంది రాకపోయే సరికి, తిరిగి ఎమర్జెన్సీ వార్డుకు  వెళ్లి విషయం చెప్పి, స్కానింగ్ సిబ్బందికి ఫోన్ చేయించారు బాలాజీ. దీంతో స్కానింగ్ సెంటర్ వద్దకు వచ్చిన సిబ్బంది బాలుడికి స్కానింగ్ చేశారు. 


ఉచిత సలహా


ఆ రిపోర్టును తీసుకుని వైద్యుల వద్దకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులకు నాణెన్ని తీసేందుకు వీలుకాదని, తిరుపతికి గానీ, వేలూరు సీఎంసీ ఆసుపత్రికి గానీ తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగ్గారు. ఇక చేసేది లేక బాలుడిని బంధువుల సహాయంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలుడి గొంతు నుంచి చాకచక్యంగా ఐదు రూపాయల నాణెం తొలగించడంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.