Chandrababu Letter To Jagan On APPSC :  గ్రూప్ - 1 నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతూ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌కు ( CM Jagan ) ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ చేయాల్సిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వీర్యమైందన్నారు.  ప్రతి ఏడాది జనవరిలో క్రమం తప్పకుండా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలవుతుందని మూడేళ్లగా యువత ఎదురు చూస్తున్నారని కానీ ఇంత వరకూ అమలు చేయలేదన్నారు. 


గ్రూప్ - 1 ప్రక్రియలో అడుగడుగునా అవకతవకలు


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( APPSC ) గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్ధులను ఎంపిక చేయడంలో గత 3 సంవత్సరాలుగా వ్యవహరిస్తున్న తీరు అభ్యర్ధుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదనను కలుగజేస్తోందన్నారు. 2018లో ప్రకటించిన 165 గ్రూప్‌-1 ఉద్యోగాలకు డిసెంబర్‌ 2019లో వ్రాత పరీక్షలు జరిపి మే 2021లో ఫలితాలు ప్రకటించారని, గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీల ప్రకటన నుంచి ఫలితాల విడుదల వరకు అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. 


విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలి 


మెయిన్స్‌ ( Group 1 Mains ) పరీక్షల తేదీలను ఐదుసార్లు మార్చారని... పరీక్షా పత్రాల మూల్యాంకనం తప్పుడు తడకలుగా జరిగిందన్నారు.  తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు కార్యదర్శి, కమిషన్‌ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని అభ్యర్ధులు భావిస్తున్నారన్నారు.  ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం మొదటి మూల్యాంకనంకు, రెండవ మూల్యాంకనంకు ఫలితాల్లో 15 శాతం తేడా లేనప్పుడు మూడవ మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఏంటని చంద్రబాబు ( Chandrababu )  ప్రశ్నించారు. తమ అస్మదీయులను అందలం ఎక్కించటం కోసం గ్రూప్‌-1 మెయిన్స్‌లో అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. 


ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాశ 


మొదటిసారి విడుదల చేసిన ఫలితాలకు రెండవసారి విడుదల చేసిన ఫలితాలకు భారీ వ్యత్యాసాలు ఉండటంతో అభ్యర్దులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారనివీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్దులకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపికలో సైతం అక్రమాలు జరిగినట్టు పలువురు అభ్యర్దులు ఫిర్యాదు చేశారని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ( Notifications ) ఇవ్వకపోవటంతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.