Chandrababu will go beneficiaries homes :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వృద్ధాప్య పెన్షన్లను భారీగా పెంచారు. అన్ని రకాల పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తానే స్వయంగా వెళ్లి పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఏ లబ్దిదారుల ఇళ్లకు వెళతారన్నది అధికారికంగా ప్రకటించనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో చంద్రబాబు పెన్షన్లను లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేసే అవకాశం ఉంది. 


ఇప్పటికే లబ్దిదారులకు చంద్రబాబు బహిరంగలేఖ 


పెన్షన్ లబ్దిదారులకు ఇప్పటికే చంద్రబాబు బహిరంగలేఖ రాశారు.   ఏ ఆశలు, ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యం. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ. 1000 పెంచి…. ఇకపై రూ.4000 ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.3000 పెంచి… ఇక నుంచి రూ.6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాము. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని లేఖలో తెలిపారు. 


నెలకు రూ. 819 కోట్ల భారం 


 పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతున్నా.. ప్రజా శ్రేయస్సుకోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామని లేఖలో పేర్కొన్నారు.  ఎన్నికల సమయంలో వికృత రాజకీయాలకోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభపెట్టింది. ఆ మూడు నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చలించిపోయాను. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి… ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చాను. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింప చేసి మీకు అందిస్తున్నాము. మూడు నెలలకు పెంచిన రూ.3000, జూలై నెల పింఛన్ రూ.4000 కలిపి మొత్తం రూ.7000 మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 


పెన్షన్లు ప్రారంభించి ఎన్టీఆర్ - అందుకే ఆయన పేరు 


సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆధ్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టాము. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాము. ప్రజా భద్రత మా బాధ్యత. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నానని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.అందరికీ తన సందేశం చేర్చడంతో  పాటు కొంత మంది లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లాలనుకోవడం ఆసక్తికరంగా మారింది.