Chandrababu warning to MLAs: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంత మంది తరచూ వివాదాస్పద పనులు చేస్తూండటంతో సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.  అమరావతిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కూటమి ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.  అవసరమైతే విలిజెన్స్ దర్యాప్తునకు కూడా ఆదేశిస్తామని.. అలాంటి వారిని వదులుకునేందుకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. 

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా  రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో అటవీ సిబ్బందిపై దాడి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆయనపై కేసు నమోదు కు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు ముందు  ఆమదాలవలస, గుంటూరు ఈస్ట్, అనంతపురం ఎమ్మెల్యేల వివాదాస్పద ప్రవర్తనపై   అసంతృప్తి వెలిబుచ్చారు.  అనంతపురం ఎమ్మెల్యే డగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ,  మంత్రి నారా లోకేష్‌పై చేసిన వివాదాస్పద ఆడియో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.  చంద్రబాబు ప్రతి ఆరు నెలలకు ఎమ్మెల్యేలు,  ఎంపీల పనితీరును సమీక్షిస్తున్నారు. ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. 21 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు  ఎమ్మెల్యేలను ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, వనరుల దోపిడీ వల్ల ప్రజలు ఆ పార్టీకి ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని, టీడీపీ అదే తప్పిదం చేయకూడదని  హెచ్చరి్సతూ వస్తున్నారు.  

 ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం ఎమ్మెల్యేల బాధ్యత అని  ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు.    పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలు పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగిస్తాయని, అటువంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు.   జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్,  బీజేపీ నాయకులను కూడా తమ ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించాలని సూచించారు. కొందరు జనసేన ఎమ్మెల్యేలపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వారిని పవన్ కళ్యాణ్ క్రమశిక్షణలోకి తీసుకురావాలని  గతంలో సూచించారు. 

కూటమి ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు. అదే సమయంలో నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన వారు కూడా.. టీడీపీ ఎమ్మెల్యేలతో కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారని..  అందుకే ఎమ్మెల్యేలుక ఎదురులేకుండా పోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో  వారు చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ, అహంకారం చూపిస్తూ..  మీడియాలో హైలెట్ అవుతున్నారు. ఇది టీడీపీకి చెడ్డపేరు తెస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.