Chandrababu Naidu in Delhi: చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం (ఫిబ్రవరి 7) రాత్రి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు. అక్కడికే టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ సహా అందరూ వచ్చారు. ఇటీవల వైసీపీ నుంచి బయటికి వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా చంద్రబాబు ఉన్న గల్లా జయదేవ్ ఇంటికి వచ్చి కలిశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


అయితే, ఈ రాత్రికి లేదా రేపు ఉదయం చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. మరోవైపు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి రేపు ప్రయాణం కానున్నట్లు సమాచారం.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తుల విషయంలో బీజేపీతో చర్చించడం కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో టీడీపీ - జనసేనలో పొత్తులో ఉన్నాయి. ఎప్పటినుంచో జనసేన - బీజేపీ పొత్తులో ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ - జనసేన పొత్తులో కలుస్తుందని భావిస్తున్నారు. అందులో భాగంగా చర్చల కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ పెద్దలతో భేటీలోనే సీట్ల సర్దుబాటు విషయంలోనూ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.